ఉసురు తీస్తోన్న కరోనా వైరస్: దేశంలో మూడో మరణం: 64 ఏళ్ల వృద్ధుడి మృతి
ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ను నియంత్రించడానికి ఇప్పటిదాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు క్రమంగా కట్టు తప్పుతున్నట్టు కనిపిస్తోంది. కరోనా వైరస్ మరొకరి ఉసురు తీసింది. ఈ వైరస్ లక్షణాలు భారత్లో కనిపించిన తరువాత.. నమోదైన మూడో మరణం ఇది. తాజాగా 64 సంవత్సరాల వృద్ధుడొకరు కరోనా వైరస్ బారిన పడి మరణించారు. ముంబైలోని కస్తూర్బా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఆ రోగి.. మంగళవారం ఉదయం మరణించాడు.
కర్ణాటకలోని కలబురగిలో తొలిసారిగా కరోనా మరణం కేసు నమోదైన విషయం తెలిసిందే. సౌదీ అరేబియా నుంచి కలబురగికి వచ్చిన 74 సంవత్సరాల వృద్ధుడు కరోనా వైరస్ బారిన పడి మరణించాడు. మరో మృతి మహారాష్ట్రలోనే సంభవించింది. తాజాగా ముంబైలో మరో మరణం సంభవించడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అత్యధికంగా 38 కేసులు మహారాష్ట్రలో నమోదైనవే.
Recommended Video
తాజాగా సంభవించిన ఈ మరణంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. మూడో మరణం నమోదైన కస్తూర్బా ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్తో ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు సంప్రదింపులు జరిపారు. కస్తూర్బా ఆసుపత్రిలో ఎంతమంది కరోనా వైరస్ సోకిన రోగులు ఉన్నారనే విషయంపై ఆరా తీశారు. మిగిలిన వార్డుల్లో ఉన్న రోగుల కోసం ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు సంక్రమించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.