C-Voter Survey:బెస్ట్ సీఎంగా జగన్ ర్యాంక్ ఇదే... కేసీఆర్కు దక్కని పాపులారిటీ, మోడీపై ఇలా..!
న్యూఢిల్లీ: కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ.. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ తీసుకుంటున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కొనియాడింది. అంతేకాదు భారత్లో కరోనా నియంత్రణ చర్యలు భేష్ అని పలు ప్రపంచ దేశాధినేతలే మోడీపై ప్రశంసలు కురిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు తాజాగా ప్రధాని మోడీ అత్యుత్తమమైన వ్యక్తి అంటూ అతనికి 65శాతం మంది మద్దతు తెలిపారు. ఈ విషయం సీఓటర్ సర్వే ద్వారా తెలిసింది. ఇక ముఖ్యమంత్రుల్లో పాపులర్ కేటగిరీలో ప్రజలు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్కు ఓటువేసి అగ్రస్థానంలో కూర్చోబెట్టినట్లు సీఓటర్ సంస్థ తెలిపింది.

మోడీకి అగ్రతాంబూలం ఇచ్చిన దేశ ప్రజలు
సాధారణంగా ఎన్నికల ఓ ఏడాది ఉన్నప్పుడో.. లేక ఎన్నికలకు కొన్ని నెలల ముందో సర్వేలు జరుగుతాయి. ఆ ఫలితాలు వెలువడుతాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పలు సర్వే సంస్థలు నెలకో లేక రెండు నెలలకోసారి సర్వేలు చేస్తూ ఫలితాలను ప్రకటిస్తున్నాయి. తాజాగా సీఓటర్ సర్వే స్టేట్ ఆఫ్ ది నేషన్ 2020: మే పేరుతో సర్వే నిర్వహించింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలో 3వేల మంది నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రం ప్రజలు అగ్రతాంబూలం ఇచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రధానిగా మోడీ తీసుకున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలకు ప్రజలు హ్యాట్సాఫ్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీల మధ్య ప్రజలకు ప్రశ్నలు సంధించగా... 66.2శాతం మంది మోడీ వైపు నిలిచారు. మరోవైపు రాహుల్ గాంధీకి 23.21 శాతం మంది మాత్రమే అండగా ఉన్నారు.

మోడీకి 90శాతంకు పైగా మార్కులు వేసిన మూడు రాష్ట్రాలు
ఇక ప్రధాని మోడీ పనితీరుపై 58.36శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. 24.04శాతం మంది మాత్రం కొంతవరకు సంతృప్తి వ్యక్తం చేశారు. 16.71శాతం మంది మాత్రం ప్రధాని మోడీ పనితీరుపై పూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఆయా రాష్ట్రాల విషయానికొస్తే ఒడిషాలోని ప్రజలు అత్యధికంగా మోడీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ వారు 95.6శాతం మార్కులు వేశారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ 93.95 శాతం, 92.73 శాతంతో చత్తీస్గడ్లు నిలిచాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోడీ పనితీరుకు 83.6 శాతం మార్కులు వేసి నాల్గవ స్థానంలో నిలువగా తెలంగాణ ప్రజలు 71.51 శాతం మార్కులు వేసి 9 వస్థానంలో నిలిచారు. పాపులారిటీ విషయంలో మోడీకి అత్యంత తక్కువ మార్కులు వేశాయి రెండు దక్షిణ రాష్ట్రాలు. తమిళనాడు 32.15శాతం ఇవ్వగా కేరళ 32.89 శాతం మార్కులు వేసింది.

నాల్గవ స్థానంలో జగన్... తగ్గిన కేసీఆర్ పాపులారిటీ
ఇక రాష్ట్రాల్లో బెస్ట్ సీఎం ఎవరని ప్రశ్నించగా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, మరియు చత్తీస్గఢ్ సీఎం భూపేష్ భగేల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరకు 82.96శాతంతో నవీన్ పట్నాయక్ తొలిస్థానంలో నిలిచారు. భూపేష్ భగల్ 81.06శాతంతో రెండో స్థానంలో నిలిచారు. ఇక సంక్షేమ పథకాలతో దూసుకెళుతున్న ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాల్గవ స్థానంలో నిలిచారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టాప్ 8 ముఖ్యమంత్రుల జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. అత్యంత తక్కువ పాపులారిటీ ఉన్న జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్ 54.22శాతంతో ఎనిమిదవ స్థానంలో నిలిచారు. ఈ కేటగిరీలో హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ 4.47శాతంతో 23వ స్థానంలో నిలిచారు.

కేంద్ర ప్రభుత్వం పని తీరుపై ఆయా రాష్ట్రాలు ఇలా..
ఇక కేంద్రప్రభుత్వం పనితీరుతో చాలా వరకు రాష్ట్రాలు సంతృప్తిని వ్యక్తం చేశాయి. ఎన్డీయే ప్రభుత్వం పనితీరుపై 90శాతం మార్కులు వేశాయి హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 78.65శాతం మార్కులు వేయగా తెలంగాణ 68.96శాతం మార్కులు వేసింది. మొత్తానికి 62శాతం మంది ప్రజలు కేంద్ర ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే ప్రధానిగా మోడీ కంటే రాహుల్ గాంధీ బెటర్ అని మూడు రాష్ట్ర ప్రజలు గోవా, కేరళ తమిళనాడు ప్రజలు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications