ఎన్ఐఏ ఆపరేషన్: ఏడుగురు వేర్పాటువాద నేతల అరెస్ట్
కాశ్మీర్లో ఉగ్రవాద సంస్థలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కొరడా ఝుళిపించింది. ఉగ్ర సంస్థలకు నిధులు అందిస్తున్న ఆరోపణలపై వేర్పాటువాద నేతలను అదుపులోకి తీసుకుంది.
న్యూఢిల్లీ: కాశ్మీర్లో ఉగ్రవాద సంస్థలకు నిధులు అందిస్తున్న ఆరోపణలపై వేర్పాటువాద నేత ఎస్ఎఎస్ గిలానీ అల్లుడుతో సహా ఏడుగురు వేర్పాటువాద నేతలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం అరెస్టు చేసింది.
అరెస్టయిన వారిలో అల్టాఫ్ షా, అయాజ్ అక్బర్, పీర్ సైఫుల్లా, మెహ్రాజ్ కల్వల్, షాహిద్-ఉల్-ఇస్లాం, నయీం ఖాన్, బిట్టా కరాటే ఉన్నారు. వీరిలో అల్టాఫ్ షా, అయాజ్ అక్బర్, పీర్ సైఫుల్లా, మెహ్రాజ్ కల్వల్, సాహిద్-ఉల్-ఇస్లాంలను శ్రీనగర్లో అరెస్టు చేయగా.. బిట్టా కరాటేను ఢిల్లీలో అరెస్టు చేశారు.

శ్రీనగర్లో అరెస్టు చేసిన వారిని మరింత ప్రశ్నించేందుకు ఢిల్లీ తీసుకువెళ్తున్నారు.
ఎన్ఐఏ జూన్ నెలలో శ్రీనగర్లోని అల్టాఫ్ షా (గిలానీ అల్లుడు) నివాసంపై దాడులు చేసింది. షాహిద్-ఉల్-ఇస్లాం తదితరులపై కూడా దాడులు నిర్వహించింది. కాశ్మీర్లో విచ్ఛిన్నకర కార్యకలాపాల కోసం నిధులు అందుకుంటున్నారన్న కారణంగా వేర్పాటువాద గ్రూపులపై ఈ దాడులను ఎన్ఐఏ నిర్వహించింది.
కొన్ని అకౌంట్ పుస్తకాలు, రూ.2 కోట్ల నగదు, నిషేధిత సంస్థలకు చెందిన లెటర్ హెడ్స్ను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. కాశ్మీర్లో ఉగ్ర కార్యక్రమాలు, భద్రతా దళాలపై రాళ్లు రువ్వడాలు, స్కూళ్లు తగులబెట్టడం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి వాటి వెనుక సూత్రధారులు ఎవరు? నిధులు ఎలా సమకూరుతున్నాయనే వ్యవహారంపై ఎన్ఐఏ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే తనిఖీలు నిర్వహిస్తోంది.
నిందితులను అరెస్ట్ చేస్తోంది.












Click it and Unblock the Notifications