ఘోరం: కొడుకు రేప్ చేస్తే.. తండ్రి చంపేశాడు
అలహాబాద్: ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన పిల్లలకు మంచి ప్రవర్తనతో పెంచాల్సిన ఓ తండ్రి.. రాక్షసుడిలా ప్రవర్తించాడు. ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కుమారుడికి అండగా నిలిచిన ఆ దుర్మార్గుడు.. మూడు వారాల తర్వాత బాధిత బాలికను దారుణంగా కొట్టి చంపాడు.
వివరాల్లోకి వెళితే.. జూన్ 5వ తేదీన బాలికపై ఆమె పొరుగింట్లోని 15ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే కొద్ది రోజుల వరకు పోలీసులు కేసు నమోదు చేసుకోవడానికి నిరాకరించారని కుటుంబసభ్యులు వెల్లడించారు.
తర్వాత ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. గత ఆదివారం నిందితుడైన 15ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేశారు. దీంతో బాధితురాలిపై కోపం పెంచుకున్నాడు నిందితుడి తండ్రి. ఈ క్రమంలో బాలుడిని అరెస్ట్ చేసిన రెండు రోజుల తర్వాత బాలుడి తండ్రి, మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి రాత్రిపూట పాపను ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి దారుణంగా కొట్టి చంపేశారు.
తన కొడుకును కేసు నుంచి కాపాడడానికి బాలుడి తండ్రి పాపను చంపేశాడని పోలీసులు వెల్లడించారు. బాలుడి తండ్రిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పోస్ట్మార్టం అనంతరం పాప మృతదేహాన్ని బుధవారం ఆమె కుటుంబసభ్యులకు అప్పగించే సమయంలో తీవ్ర ఆందోళనలు జరిగాయి.
దీంతో బాధిత చిన్నారి కుటుంబసభ్యులపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో ఆందోళనకారులను అదుపుచేయాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.