చచ్చిన బాలిక బతికొస్తుందని, భూగృహంలో నిర్బంధం
బెల్గాంకు 180 కిలోమీటర్ల దూరంలో అథని తాలూకా జుంజర్వాడా గ్రామంలోని చంద్రగిరి మఠంపై పోలీసులు దాడి చేశారు. ఆ దాడి సందర్భంగా బాబా సదాశివ అలియాస్ అయ్యప్ప సామిని, అతని అనుచరుడు గురుపద్గౌడ పాటిల్ను పోలీసులు అరెస్టు చేసారు.
ఆ బాలికను తాను దత్తత తీసుకున్నట్లు ఆ బాబా చెప్పాడు. బాలికను అథనిలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. గత 20 రోజులుగా బాలిక ఆహారం గానీ ద్రవపదార్థం గానీ తీసుకోలేదని బాబా చెబుతున్న మాటలను ముఖ్య వైద్యాధికారి పుష్పలత సున్నదకల్ ఖండించారు. అధ్యాత్మిక శక్తితో బాలిక జీవిస్తోందని చెప్పిన స్వామీజీ మాటలను కూడా అధికారి తోసి పుచ్చారు.
నిజలింగమ్మ చన్నప్ప దోడమణి అనే బాలికను ఉంచిన భూగృహంలో కర్మ నిర్వహణకు ఉంచిన వస్తువులతో పాటు ఆహారం, నీళ్లు, దీపం, కిరోసిన్ పోలీసుల చేతికి చిక్కాయి. ఈ సంఘటనతో జిల్లా శిశు సంరక్షణ అధికారి అరుణ్ నీలరలగట్టి ఆశ్రమంలోని మరో ఐదుగురు బాలికలకు విముక్తి కల్పించారు.
ఇరవై రోజుల క్రితం ఆశ్రమాధికారులు యోగ సమాధి గురించి ముమ్మరంగా ప్రచారం సాగించారు. మానవ సంక్షేమానికి దాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యోగ సమాధిలో భాగంగా బాలికను దహించిన, శివరాత్రి రోజు తిరిగి ప్రాణం పోస్తారని చెప్పారు.
ముందు రచించుకున్న ప్రణాళిక ప్రకారం కర్ర మొద్దుల కింద ఉంచి మంట పెట్టారు. వందలాది భక్తులు ఆ దృశ్యాన్ని చూశారు. బాలికను అక్కడి నుంచి తప్పించారు. బాలికకు బొగ్గు పూశారు, బూడిద రాశారు. దీంతో ఆమె మరణించినట్లు భావించే విధంగా చేశారు ఆ తర్వాత భూగృహంలో దాచి పెట్టారు. ఆమె బతికి వచ్చిందని శివరాత్రి రోజు ప్రకటించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు
తాను భాగల్కోట్ జిల్లాలోని జాంఖండి తాలుకాలో గల సూర్పాలి గ్రామానికి చెందిన దంపతుల నుంచి తాను ఆ బాలికను దత్తత తీసుకున్నట్లు అయ్యప్ప స్వామి చెబుతున్నాడు. అయితే ఆ దత్తత చెల్లదని, దత్తతకు అవసరమైన విధానాలను పాటించలేదని మహిలా శిశు సంక్షేమ అధికారులు చెబుతున్నారు.
మొదటి నుంచీ వివాదమే...
తనకు అధ్యాత్మిక శక్తులు ఉన్నాయని ప్రకటించుకున్న ఈ స్వామీజి వివాదాలకు ఆలవాలంగా మారాడు తనపై అత్యాచారం కేసు నమోదు కావడంతో తనకు తనకు కామవాంఛలు లేవని చాటుకోవడం కోసం జర్నలిస్టుల ముందు దుస్తులన్నీ విప్పేశాడు.
అతనిపై 2010లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. తాను ఆహారం, గాలి లేకుండా ఆధ్యాత్మిక శక్తులతో జీవిస్తానని చెప్పి భూగృహంలో దాచుకున్నందుకు ఈ కేసు నమోదైంది. అతనిపై రెండు వేధింపుల కేసులు కూడా నమోదైంది. అయితే, తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆ కేసులు వీగిపోయాయి.