70వేల మంది భారతీయ సైనికులకు కరోనా పాజిటివ్: 190 మంది మృతి
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి బారినపడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారతదేశంలో ఇప్పటి వరకు మొత్తం 70 వేల మంది సైనికులకు కరోనా సోకినట్టు కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ పేర్కొన్నారు. రాజ్యసభలో కోవిడ్ కేసులపై అడిగిన ప్రశ్నకు అజయ్ భట్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
దేశవ్యాప్తంగా మొత్తం 3.40 లక్షల మంది కరోనా బారినపడి కోలుకున్నారని, ఇందులో 70 వేల మంది సాయుధ బలగాలు ఉన్నాయని ఆయన తెలిపారు. మొత్తం 190 మంది సైనికులు కరోనా మహమ్మారికి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
భారత సైన్యానికి చెందిన 45,576 మంది కరోనా బారిన పడగా, 137 మంది మృతి చెందారని, ఇండియన్ ఎయిర్ఫోర్స్లో 14,022 మంది సిబ్బంది కరోనా బారిన పడగా 49 మంది మృతి చెందారని, ఇండియన్ నేవీలో 7,747మంది కరోనా బారిన పడగా నలుగురు మృతి చెందినట్టు మంత్రి అజయ్ భట్ రాజ్యసభలో వివరించారు. ఇక విధులు నిర్వహించే సమయంలో కరోనాతో మృతి చెందితే నిబంధనల ప్రకారం వారికి ప్రత్యేకమైన పరిహారం లభించే అవకాశం లేదని, అయితే, మరణానంతరం సైనికులకు అందాల్సిన ప్రోత్సహకాలు అన్ని అందుతాయని మంత్రి తెలిపారు.
ఇది ఇలావుండగా, ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో త్వరలోనే బూస్టర్ డోస్ను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించిన ఓ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని, వచ్చే రెండు వారాల్లో దీన్ని ప్రకటిస్తామని కోవిడ్ 19 టాస్క్ఫోర్స్ ఛైర్మన్ డాక్టర్ ఎన్ కే అరోరా తెలిపారు. ఓ సమగ్రమైన ప్రణాళికకు తుది రూపాన్ని ఇస్తున్నామని పేర్కొన్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉందని అన్నారు.
ప్రస్తుతం భారత్లో బూస్టర్ డోస్ అందుబాటులో లేదు. దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దీన్ని చేర్చలేదు. రెండు డోసుల వ్యాక్సిన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటిదాకా 115 కోట్ల మందికి పైగా ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇందులో సింగిల్ డోస్ తీసుకున్న వారి సంఖ్యే అధికంగా ఉంటోంది. సెకెండ్ డోస్ కోసం మూడు నెలల పాటు వేచి చూడాల్సి వస్తోంది. వ్యాక్సిన్ లభ్యతను బట్టి రెండు డోసుల టీకాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది.
దీనికి అదనంగా బూస్టర్ డోస్ను కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని డాక్టర్ ఎన్ కే అరోరా అన్నారు. 18 సంవత్సరాల లోపు వయస్సున్న వారికి ఇమ్యూనిటీని పెంచడానికి అవసరమైన వ్యాక్సిన్పైనా ప్రకటన చేస్తామని చెప్పారు. ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలనే విషయంపై ప్రస్తుతం పరిశీలనలో ఉందని, దీనిపై ఓ నిర్ణయానికి వచ్చిన వెంటనే ఈ కార్యాచరణ ప్రణాళిక, బూస్టర్ డోస్ విధానాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేశారు.