కేజ్రీవాల్కి 'ఢిల్లీ' ప్రజల సర్వే షాక్: అవినీతి తగ్గలేదు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ అవినీతి ఏమాత్రం తగ్గలేదని 70 శాతం మందికి పైగా ఢిల్లీ ప్రజలు వాపోతున్నారని ఓ ఆన్ లైన్ సర్వేలో తేలింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ఢిల్లీ పగ్గాలు చేపట్టి సంవత్సరం గడిచింది.
ఈ నేపథ్యంలో ఏఏపీ ప్రభుత్వంపై ఆ పార్టీ బహిష్కృత నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్లు ఏర్పాటు చేసిన స్వరాజ్ అభియాన్ సర్వే చేపట్టింది. ఇందులో వెల్లడైన వివరాల ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి తగ్గలేదని 77 శాతం మంది చెప్పారు.
అయితే, ఇందులో 50 శాతం మంది ప్రజలు తాము ఏఏపీకే ఓటు వేశామని, కానీ అవినీతి తగ్గలేదని చెప్పడం గమనార్హం. 48 శాతం మంది ఢిల్లీ ప్రజలు సరి - బేసి సంఖ్య ప్రయోగం సఫలమైందని చెప్పారు. 62 శాతం మంది విద్యుత్ బిల్లులు తగ్గలేదని, నెలకు 20వేల లీటర్ల ఉచిత నీరు అందడంలేదని చెప్పారు.
కాగా, ఫిబ్రవరి 10 నుంచి 14వ తేదీ వరకు ఢిల్లీలో ఈ సర్వే చేశారు. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో పది వేల మందిని ప్రశ్నించి స్వరాజ్ అభియాన్ కార్యకర్తలు సర్వే నిర్వహించారు. 86శాతం మంది కేజ్రీవాల్ మొదట హామీ ఇచ్చినట్లుగా జన్ లోక్పాల్ బిల్లు లేదని సర్వేలో తెలిపినట్లు చెప్పారు.
74శాతం మంది రేషన్ దుకాణాల్లో అవినీతి తగ్గలేదన్నారు. ఇప్పుడు కూడా మహిళలకు రక్షణ లేదని 80 శాతం మంది అభిప్రాయపడ్డారట. సీసీటీవీలు తమ ప్రాంతాల్లో ఇంకా ఏర్పాటు చేయలేదని 87 శాతం మంది చెప్పారు. 85శాతం మంది తమ ప్రాంతాల్లో ఇంకా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించలేదన్నారు.
గత ఎమ్మెల్యేల కంటే వీరి బెట్టర్ అని కేవలం 32 శాతం ప్రజలు మాత్రమే అభిప్రాయపడ్డారు. అదే సమయంలో 17 శాతం మంది ప్రజలు మాత్రమే పేదవారి పరిస్థితి కాస్త మెరుగైందని చెబుతున్నారు. ఈ సర్వే ఇటీవలే విడుదలైంది.