ఢిల్లీలో కలకలం: పిజ్జా డోర్ డెలివరి బాయ్కు సోకిన కరోనా వైరస్: 72 కుటుంబాలు పరుగులు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ.. దేశ రాజధానిలో చోటు చేసుకున్న ఓ ఘటన మరింత బీభత్సాన్ని సృష్టించింది. పిజ్జా డెలివరి బాయ్ కరోనా వైరస్ బారిన పడినట్లు వచ్చిన వార్తలు.. కొన్ని కుటుంబాలను భయాందోళనలకు గురి చేశాయి. ఆయా కుటుంబాల్లోని వారంతా క్వారంటైన్కు పరుగులు పెట్టాలే చేశాయి. ఆ ఉద్యోగితో పాటు అదే పిజ్జా ఔట్లెట్లో పని చేస్తోన్న 16 మందిని ఆసుపత్రికి తరలించారు. వారందరికీ పరీక్షలను నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీలోని మాలవీయ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
లాక్డౌన్ వేళ..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా రెండోదశ లాక్డౌన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ, ముంబై వంటి మెట్రో సిటీల్లో ఫుడ్ డెలివరీ ఔట్లెట్లకు డిమాండ్ పెరిగింది. దీనితో ఆయా ఔట్లెట్ల యజమానులు స్థానిక పోలీసుల నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకుని ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సిబ్బందికి పోలీసులు కూడా ఎక్కడా అడ్డు చెప్పట్లేదు. ఆహార పదార్థాలను సరఫరా చేయాల్సి వస్తున్నందున ఫుడ్ డెలివరీ సిబ్బంది కార్యకలాపాలను యథా ప్రకారం కొనసాగుతున్నాయి.
రెండురోజుల్లో 72 కుటుంబాలు..
ఈ క్రమంలో న్యూఢిల్లీలోని మాలవీయ నగర్కు చెందిన 72 కుటుంబాలు 15 రోజులుగా తరచూ పిజ్జాను ఆన్లైన్ ద్వారా తెప్పించుకుంటూ వచ్చారు. ఒకే ప్రాంతం కావడం వల్ల ఒకే వ్యక్తి ఆయా కుటుంబాలందరికీ పిజ్జాను డెలివరీ చేశారు. ఈ ఘటన చోటు చేసుకున్న మూడు రోజుల తరువాత.. ఆ వ్యక్తి అనారోగ్యానికి గురి అయ్యారు. ఆయనకు పరీక్షలను నిర్వహించగా.. కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఆ డెలివరీ బాయ్ కరోనా వైరస్ పాజిటివ్గా అధికారులు నిర్ధారించారు. ఈ విషయాన్ని దక్షిణ ఢిల్లీ ప్రాంత మెజిస్ట్రేట్ బీఎం మిశ్రా తెలిపారు.
క్వారంటైన్కు పరుగులు..
ఈ విషయం తెలిసిన వెంటనే 72 కుటుంబాల వారు క్వారంటైన్కు పరుగులు పెట్టారు. ఆయా కుటుంబాల్లోని కొందరు సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. మరి కొందరు ఆసుపత్రులను ఆశ్రయించారు. తమ ఉద్యోగికి వైరస్ సోకడం పట్ల ఎవరూ భయాందోళలకు గురి కావాల్సిన అవసరం లేదని రెస్టారెంట్ల యాజమాన్యం వెల్లడించింది. తమ వద్ద పని చేసే డోర్ డెలివరీ సిబ్బంది అందరికీ మాస్కులు, గ్లోవుజ్లను అందజేశామని, వారి నుంచి ఎవరికి కూడా వైరస్ సంక్రమించి ఉండకపోవచ్చని పేర్కొంది.
అయిదు కిలోమీటర్ల పరిధిలో..
మాలవీయ నగర్ పరిధిలో సుమారు అయిదు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఆ ఉద్యోగి పిజ్జాను డోర్ డెలివరీ చేసినట్లు తేలింది. హౌస్ ఖాస్, సావిత్రి నగర్ ప్రాంతాల్లో కూడా ఆయన పిజ్జాను డోర్ డెలివరి ఇచ్చినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఈ 72 కుటుంబాల వారిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. వారికి కరోనా వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఆ ఉద్యోగి నుంచి పిజ్జాను తెప్పించుకున్న కుటుంబాలు ఇంకా ఏవైనా ఉంటే వెంటనే క్వారంటైన్కు వెళ్లాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆదేశాలను జారీ చేశారు. అలా రాలేని కుటుంబాల వారు వెంటనే సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని సూచించారు.