రాక్షస దంపతులు: 5000 మంది బాలికలు వ్యభిచార రొంపిలోకి...
దాదాపు 5 వేల మంది బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపిన రాక్షస దంపతులపై పోలీసులు మోకా కేసు నమోదు చేశారు. వారు పెద్ద యెత్తున ఆస్తులు కూడబెట్టినట్లు కూడా తేలింది.
న్యూఢిల్లీ : దాదాపు ఐదు వేల మంది బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపిన దంపతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీకి చెందిన అఫాఖ్ హుస్సేన్, సారియా బేగం దంపతులు ఐదువేల మంది బాలికలను బలవంతంగా వ్యభిచారం రొంపిలోకి దించారని పోలీసుల విచారణలో తేలింది. దీంతో వారిపై మోకా చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ దంపతులు సాగించిన అకృత్యాలపై పోలీసులు 3,895 పేజీల చార్జీషీటును కోర్టుకు సమర్పించారు. వ్యభిచారం రాకెట్ నిర్వహణ ద్వారా ఈ దంపతులు సంపాదించిన రూ.246 కోట్ల రూపాయల విలువగల 18 స్థిరాస్తులను పోలీసులు గుర్తించి కోర్టుకు వివరాలు సమర్పించారు. గతంలో ఈ దంపతులు బాలికలతో వ్యభిచారం చేయించిన కేసుల్లో ఎనిమిదిసార్లు పోలీసులు అరెస్టు చేశారు.
ఢిల్లీ జీబీ రోడ్డులోని రెడ్ లైట్ ప్రాంతం నుంచి 16 ఏళ్ల బాలికకు పశ్చిమబెంగాల్ పోలీసులు విముక్తి కల్పించగా హుస్సేన్, సారియా బేగం దంపతుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని దుర్గాపూర్ నగరంలో ఓ బాలికతో హుస్సేన్, సారియా దంపతులు బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని వెల్లడైంది.
వేశ్యావాటికలో మగ్గుతున్న ఆ బాలిక ఓ విటుడి ఫోన్ తీసుకొని తండ్రికి ఫోన్ చేయడంతో వ్యభిచారం రాకెట్ విషయం బయటపడింది. ఈ దంపతులకు ఢిల్లీలోని జైత్పూర్ ప్రాంతంలో ఓ అతిథి గృహంతోపాటు పాఠశాల ఉందని పోలీసుల విచారణలో తేలింది. వీరికి ఆడితోపాటు ఆరు విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయని తేలింది.
బెంగళూరు నగరంలో కూడా వీరికి నాలుగుకోట్లరూపాయల విలువగల భవనం ఉండగా దాన్ని ఇటీవల విక్రయించారని తేలింది. ఢిల్లీ కేంద్రంగా సెక్స్ రాకెట్ ను ఈ దంపతులు నడిపించారని పోలీసులు తేల్చి వారిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.
వారితో పాటు వారి అనుచరులు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి బాలికలను వారు వ్యభిచార రొంపిలోకి దింపినట్లు తేలింది. ఒక్కో బాలికను వారు రూ.2 లక్షలకు విక్రయించినట్లు కూడా చెబుతున్నారు. నేపాల్, ఒడిశా, అస్సాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన బాలికలు వారి చేతుల్లో చిక్కుకున్నారు.