కారుపై బోల్తా పడిన ఇసుక లారీ: ఊపిరి ఆడక: ఎనిమిది మంది దుర్మరణం
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇసుక లోడ్తో వెళ్తోన్న లారీ కారుపై బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు ఇసుక కుప్పల్లో చిక్కుకుపోయారు. కౌశంబి జిల్లా కడధామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవీగంజ్లో బుధవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ టైర్ పేలడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా భావిస్తున్నారు.
తమ బంధువుల ఇంట్లో జరిగిన ఓ పెళ్లి వేడుకల్లో పాల్గొన్న వారు స్కార్పియో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ తెల్లవారు జామున 3:30 గంటల సమయంలో కారు దేవీగంజ్ వద్ద ప్రమాదానికి గురైంది. ఓ ధాబా వద్ద పార్క్ చేసి ఉన్న కారుపై ఇసుక లోడుతో వెళ్తోన్న లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీనితో కారు ఇసుకలో కూరుకునిపోయింది. ఫలితంగా- ఊపిరి ఆడక ఎనిమిది మందీ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో అయిదుమంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video
వేగంగా వెళ్తోన్న ఇసుక లారీ టైరు పేలడం వల్లే అదుపు తప్పి.. కారుపై బోల్తా పడినట్లు కడధామ్ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న వెంటనే కౌశంబి జిల్లా కలెక్టర్ అమిత్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలనుు చేపట్టారు. జేసీబీని రప్పించి ఇసుకను తొలగించారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు.