ఏపీలో ఆందోళనకరంగా- ఆ నాలుగు రాష్ట్రాల్లోనూ: తేల్చేసిన జాతీయ సర్వే..!!
న్యూఢిల్లీ: మారుతున్న కాలానికి అనుగుణంగా దినచర్యల్లో చోటు చేసుకుంటోన్న మార్పులు, ఆహార అలవాట్లు.. యువతను దీర్ఘకాల అనారోగ్యానికి గురి చేస్తోన్నాయి. క్రమబద్ధంగా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేయడం, ఆలస్యంగా నిద్రపోవడం, వివిధ కారణాల వల్ల ఎదుర్కొంటోన్న ఒత్తిళ్లు.. దెబ్బకొడుతున్నాయి. దీని దుష్పరిణామాలు దీర్ఘకాల అనారోగ్యానికి గురి చేస్తోన్నాయి. కొత్త కొత్త వ్యాధుల బారిన పడటానికి కారణమౌతోన్నాయి.
ఏపీ సహా..
సాధారణంగా 50 సంవత్సరా వయస్సు దాటితే గానీ దరి చేరని చక్కెర వ్యాధి- యువతను చుట్టుముట్టుతోంది. 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు అనూహ్యంగా మధుమేహం బారిన పడుతున్నారు. వారి సంఖ్య ఎనిమిది శాతం వరకు ఉంటోంది. 35 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిలో ర్యాండమ్ బ్లడ్ గ్గూకోజ్ లెవెల్స్ అధికంగా నమోదవుతున్నాయి. ఈ సంఖ్య ఒక డెసిలీటర్ కు 140 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువగా ఉంటోంది.
ఏపీ సహా..
ఆంధ్రప్రదేశ్ సహా పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, గోవా, త్రిపురల్లో ఈ తరహా పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 తెలిపింది. 2019-2021 మధ్యకాలంలో ఫ్యామిలీ హెల్త్ సర్వే జరిగింది. 35 సంవత్సరాల వయస్సు గల వారిని ఈ సర్వేలోకి పరిగణనలోకి తీసుకుంది. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ అయిదు చోట్ల మధుమేహానికి గురైన వారు ఎనిమిది శాతం అధికంగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్, త్రిపురల్లో మహిళల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది.
తెలంగాణలో ఆరు శాతమే..
తెలంగాణలో ఈ సంఖ్య ఆరుగా నమోదైంది. తమిళనాడు, అస్సాం, మేఘాలయా, సిక్కిం, మిజోరం, గుజరాత్, ఒడిశాల్లో 35 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్నవారు షుగర్ పేషెంట్లుగా మారుతున్నది ఆరు శాతం వరకు ఉంటోంది. చక్కెర వ్యాధిని తరిమికొట్టిన రాష్ట్రాల్లో కేరళ టాప్ లో నిలిచింది. 2015-16 మధ్య జరిగిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో కేరళలో మధుమేహం బారినపడుతున్న వారు 8.8 శాతం వరకు ఉండగా.. 2019-21 నాటికి ఇది 3.9 శాతానికి క్షీణించింది.
140 ఎంజీడీఎల్ కంటే..
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ కమిషన్ ప్రకారం.. ర్యాండమ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ 140 ఎంజీ/డీఎల్ లోపు ఉంటే సాధారణంగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ సంఖ్య దాటితే డయాబెటిక్ పేషెంట్ గా పరిగణిస్తారు. మధుమేహానికి గురైనట్లుగా భావిస్తారు. యువతలో పెరుగుతున్న షుగర్ లెవెల్స్ ను నియంత్రించుకోవడానికి ఆహారపుటలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుందని, ఒత్తిడిని తగ్గించుకోవడానికి వాకింగ్, ఎక్సర్సైజులు చేయాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తోన్నారు.