సమ్మె: ఢిల్లీల్లో ఒక్కరోజే 800కి పైగా ఆపరేషన్ల నిలిపివేత
ఢిల్లీలోని ప్రభుత్వ, మున్సిపల్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న 20వేల మందికి పైగా రెసిడెంట్ డాకర్ట సమ్మె కారణంగా కేవలం గురువారం నాడే 800కిపైగా సర్జరీలు నిలిచిపోయాయి. అకస్మాత్తుగా వైద్యులు సమ్మెకు దిగడంతో పలు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని వైద్యుల సమ్మెకు సంఘీభావంగా దేశ రాజధాని న్యూఢిల్లీలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు, మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న హాస్పిటళ్లలోని 20 వేల మందికి పైగా వైద్యులు మెరుపు సమ్మెకు దిగారు. దీని ఫలింగా ఒక్కరోజే 800కి పైగా శస్త్రచికిత్సలు వాయిదా పడడంతోపాటు ఔట్ పేషంట్ విభాగంలో సేవలపైనా తీవ్ర ప్రభావం చూపింది.
మహారాష్ట్రలో రోగి బంధువులు వైద్యులపై దాడికి దిగడంతో మంగళవారం నుంచి మహారాష్ట్రలో రెసిడెండ్ డాక్టర్లు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంఘీభావంగా 'హస్తిన'లోని ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులంతా సామూహిక సెలవులు పెట్టారు. సాధారణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు మూసివేసే ఔట్ పేషంట్ల రిజిస్ట్రేషన్ ఉదయం 10 గంటలకే మూసేశారు. ఫలితంగా పేషంట్లు హుసూరంటూ వెను దిరుగాల్సి వచ్చింది.
'వైద్యులు సామూహిక సెలవు పెట్టడంతో లేడీ హార్డింగె మెడికల్ కళాశాల (ఎల్హెచ్ఎంసి) ఆసుపత్రిలో ఔట్ పేషంట్ విభాగం కార్డు (ఓపీడీ) జారీ కౌంటర్లు మూసేశాం. పలువురు రోగులకు ఈ సంగతి తెలియక చాలా సేపు క్యూ లైన్లోనే నిలుచుకున్నారు' అని ఎల్హెచ్ఎంసి నర్సు సంజనా రావత్ తెలిపారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో 38 ప్రభుత్వ ఆసుపత్రులు పని చేస్తున్నాయి.
ఎయిమ్స్ మినహా ఢిల్లీ ఆసుపత్రులన్నీ కేంద్ర పర్యవేక్షణలోనే..
ఎయిమ్స్ మినహా ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే రెసిడెంట్ డాక్టర్లంతా కేంద్ర ప్రభుత్వ పరిధిలో పని చేస్తారు. వారంతా ప్రతిరోజూ ముందస్తు షెడ్యూల్ ప్రకారం నిర్ణయించిన మేరకు 1600 శస్త్రచికిత్సలు చేస్తారు. వాటిలో అత్యవసరమైనవి 200 వరకు ఉంటాయి. కేవలం అత్యవసర విభాగం సర్వీసులు మాత్రమే పనిచేయడంతో లాల్ బహదూర్ శాస్త్రి హాస్పిటల్, దాదాదేవ్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్, జీబీ పంత్ ఆసుపత్రుల్లోని రోగులు నానా ఇబ్బందులు పడ్డారు. చివరకు ఔట్ పేషంట్ విభాగం పాక్షికంగా పనిచేసినా సాధారణ ఔషధాలు పంపిణీ చేసేవారు కరువయ్యారు.
60 % రోగులకు అందని వైద్యం
'దాదాదేవ్ మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రిలోని సుమారు 60 శాతం రోగులకు వైద్యుల సంప్రదింపులు, ట్రీట్ మెంట్ లేదు. ఎమర్జెన్సీ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న రెసిడెంట్ డాక్టర్లు మాత్రం కొంత మేరకు అత్యవసర సర్వీసులు అందించారు' అని దాదాదేవ్ మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ విభాగం అధికారి నిరుపమ్ ఘోష్ తెలిపారు. ఢిల్లీలో రెసిడెంట్ డాక్టర్ల సమాఖ్య బ్యానర్ కింద రెసిడెంట్ డాక్టర్లు నిరసన తెలిపారు. 5400 మంది రోగులు ఔట్ పేషంట్ సేవల కోసం ఒపిడి కార్డులు పొందితే వారిలో 25 శాతం మందికి మాత్రమే వైద్యం లభించింది.
భద్రత కోసం దేశవ్యాప్త సమ్మె చేస్తామంటున్న డాక్టర్లు
తమకు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న చోట భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకోకపోతే యావత్ దేశమంతా సమ్మె చేపట్టాల్సి వస్తుందని రెసిడెంట్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 'మాస్ లీవ్ అనేది మా భద్రత కోసం చేయడానికి వీలైన ఏకైక నిరసన రూపం. వైద్యులపై దాడులను నివారించేందుకు వైద్యారోగ్యశాఖ సరైన చర్యలు తీసుకోకపోతే దేశమంతా సమ్మెలోకి వెళ్తాం' అని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఒఆర్డిఎ) పంకజ్ సోలంకీ తెలిపారు.
ప్రభుత్వ వైద్యులకు ప్రైవేట్ ఆసుపత్రుల సంఘీభావం
ప్రభుత్వ వైద్యులకు తోడుగా పలు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా నిరసన తెలుపుతూ మద్దతునిచ్చాయి. డాక్టర్ల భద్రత పట్ల ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో జనరల్, ప్రైవేట్ ఔట్ పేషంట్ల విభాగాలు శుక్రవారం పని చేయవని సర్ గంగా రాం ఆసుపత్రి చైర్మన్ డీఎస్ రాణా తెలిపారు. అయితే అత్యవసర సర్వీసులు సాధారణంగానే కొనసాగుతాయన్నారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఫోర్టిస్ కూడా వైద్యులపై దాడులను ఖండించింది. వైద్యులకు భద్రతతో సురక్షితమైన వాతావరణంలో పనిచేసే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉన్నదని ఫోర్టిస్ హెల్త్ కేర్ ఒక ప్రకటనలో తెలిపింది.