నాలుగేళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వృద్ద దంపతుల లైంగిక దాడి... పదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు...
ముంబైలోని స్పెషల్ పోక్సో కోర్టు ఓ వృద్ద దంపతులకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఎనిమిదేళ్ల క్రితం 2013లో నాలుగేళ్ల ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు రుజువు కావడంతో న్యాయస్థానం వీరికి శిక్ష విధించింది. 80 ఏళ్ల వృద్దాప్యంలో ఆ దంపతులకు ఈ శిక్షపడటం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే... ముంబైలోని గిర్గావ్లో చాలాకాలంగా ఓ వృద్ద దంపతులు నివసిస్తున్నారు. వీరి ఇంటికి సమీపంలో మరో జంట నివసిస్తున్నారు. వారికి ఓ పాప ఉంది. ఓరోజు ఆ పాపను తమ ఇంటికి పిలిచిన వృద్ద దంపతులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో పోక్సో చట్టం కింద ఆ వృద్ద దంపతులపై కేసు నమోదైంది. చిన్నారి మెడికల్ రిపోర్టులోనూ ఆమెపై దాడి జరిగినట్లు వెల్లడైంది.

తాజాగా ఈ కేసును విచారించిన ముంబై పోక్సో కోర్టు వృద్ద దంపతులను దోషులుగా తేల్చింది. మనవరాలి వయసున్న చిన్నారి పట్ల నానమ్మ-తాతయ్యల్లా వ్యవహరించాల్సిందిపోయి... ఇలా లైంగిక దాడికి పాల్పడుతారా అంటూ వారిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఇద్దరికీ పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1లక్ష జరిమానా విధించింది.
కర్ణాటకలోని ఛత్రకొడహళ్లిలోనూ గత నెల ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఐదేళ్ల ఓ చిన్నారిపై 60 ఏళ్ల వృద్దుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్తూ పాపను ఇంటి వద్ద వదిలి వెళ్లడంతో ఆ వృద్దుడు చిన్నారిపై కన్నేశాడు. ఆమెకు చాక్లెట్ ఆశ చూపించి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో వదిలిపెట్టాడు. బాధిత చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదైంది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మహిళలు,చిన్నారులపై అత్యాచార ఘటనలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో నిత్యం మహిళలపై నేరాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications