'ఆపరేషన్ స్మైల్': 14 ఏళ్ల తర్వాత 87 మంది చిన్నారుల ఆచూకీ లభ్యం
హరిద్వార్: 2000వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు హరిద్వార్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అదృశ్యమైన పిల్లల్లో 87 మందిని ఉత్తరాఖండ్ పోలీసులు కనిపెట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న హరిద్వార్లో 'ఆపరేషన్ స్మైల్'ను ప్రారంభించారు. అందులో భాగంగా చిన్నారులను కనిపెట్టినట్లు సీనియర్ పోలీసులు వెల్లడించారు.
'ఆపరేషన్ స్మైల్'ను ప్రారంభించిన 18 రోజుల వ్యవధిలోనే 87 మంది చిన్నారుల ఆచూకీని తెలుసుకున్నామని హరిద్వార్ ఎస్ఎస్పీ స్వీటీ అగర్వాల్ తెలిపారు. హరిద్వార్ జిల్లాలోని రూర్కీ, మంగళూరు, లుస్కార్ తదితర ప్రాంతాల్లో 43 మంది బాలికలతోపాటు 44 బాలురను గుర్తించామని అన్నారు.
పిల్లలను వారి తల్లిదండ్రులకు తిరిగి అప్పగించినట్లు తెలిపారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జిల్లాలో 146 మంది చిన్నారులు అదృశ్యమయ్యారని ఆమె పేర్కొన్నారు. అందులో 88 మంది అబ్బాయిలు కాగా, 58 మంది అమ్మాయిలని చెప్పారు.
'ఆపరేషన్ స్మైల్' వల్ల అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది చిన్నారుల ఆచూకీ కనిపెట్టగలిగామని, త్వరలోనే మిగతా వారి ఆచూకీని తెలుసుకుంటామని అన్నారు.