వినాయకుడికి వేల రూపాలని ఊరకే అన్నారా? చంద్రయాన్ 2 సీజన్ మరి!
బెంగళూరు: వినాయకుడి ఎకో ఫ్రెండ్లీ మాత్రమే కాదు.. కళాకారులకు కూడా ఫ్రెండ్లీగా ఉండే దేవుడు. గణేషుడి విగ్రహాన్ని ఏ రకంగానైనా మలచుకునే అవకాశం ఉంది. కళాకారుల సృజనాత్మకతకు, ఊహాశక్తికి అనుగుణంగా అలా.. మౌల్డ్ అయిపోతూ ఉంటాడా విఘ్న నాయకుడు. ఈ సౌలభ్యం మరే ఇతర దేవుడిలోనూ లేదు..ఉండదు కూడా. అందుకే- కళాకారులు తమ సృజనాత్మక శక్తిని పరీక్షించుకోవడానికి గణేషుడినే ఎంచుకుంటారు. ఆయన రూపాలపై వేలవేల ప్రయోగాలు చేస్తుంటారు. సక్సెస్ అవుతుంటారు. సీజన్ కు అనుగుణంగా కూడా ఆర్టిస్టులు వినాయక విగ్రహాలను తయారు చేస్తుంటారు. దీనికి ఉదాహరణలు చెప్పుకోవాలంటే కోకొల్లలు. ఒక్క మన హైదరాబాద్ లోనే గణేషుడి విగ్రహాలు ఎన్ని వేల రూపాల్లో రూపుదిద్దుకుంటూ ఉంటాయో లెక్కేలేదు.

కొబ్బరికాయల గణేషుడు
బెంగళూరులో కొబ్బరికాయల గణేషుడు ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. పుట్టంగళ్లిలోని గణేషుడి ఆలయంలో భక్తులకు నయనానందకరంగా దర్శనం ఇస్తోన్న ఈ విగ్రహం కోసం మండప నిర్వాహకులు ఏకంగా 9000 కొబ్బరికాయలను వినియోగించారు. 30 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని కొబ్బరికాయలతో నింపేశారు. దీనికోసం సుమారు 70 మంది 20 రోజుల పాటు రేయింబవళ్లు శ్రమించి.. ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఎక్కడా రంగులు గానీ.. మరే రసాయనిక పదార్థాలను గానీ వినియోగించలేదు. పర్యావరణ హిత విగ్రహంగా దీన్ని మలిచారు. మండపాన్ని 20 రకాల కూరగాయలతో అలంకరించారు. పుట్టంగళ్లి దేవాలయాన్ని మొత్తం కూరగాయలతోనే తీర్చిదిద్దారు.

అంతరిక్ష పరిశోధకుడిగా..
ముంబైలోని ప్రఖ్యాత గణేషుడి మండపం లాల్ బాగ్. లాల్ బాగ్ చ రాజా పేరుతో ఇక్కడ వినాయకుడిని రూపొందిస్తారు. ప్రస్తుతం నడుస్తున్న సీజన్.. అంతరిక్షం. అందుకే ఇక్కడ చంద్రయాన్-2 నమూనాలో వినాయకుడిని అలంకరించారు. లాల్ బాగ్ గణేషుడి మండపంలో అడుగు పెడితే.. ఏ అంగారక గ్రహం మీద ఉన్నట్టో, లేక అంతరిక్ష నౌకలోనో ప్రయాణిస్తోన్న అనుభూతి కలుగుతుంది. వినాయకుడి విగ్రహం బ్యాక్ గ్రౌండ్ లో త్రీడీ ఎఫెక్ట్ తో అంతరిక్ష చిత్రాలు, వీడియోలను ఏర్పాటు చేశారు. స్పేస్ లో తిరుగాడుతున్న అంతరిక్ష పరిశోధకులు, నక్షత్రాలు, గ్రహాలు.. ఇవన్నీ మనకు కళ్లకు కట్టినట్టుగా అమర్చారు. అడుగు పెట్టిన వెంటనే.. విగ్రహంపై కంటే ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ల మీద మన దృష్టి మరలుతుంది.

చెరకుగడలతో గణేషుడు..
తమిళనాడులో 20 మంది కార్మికులు చెరకుతో గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. దీనికోసం వారు రెండు టన్నుల చెరకును వినియోగించారు. ఈ భారీ గణేషుడిని వారు నిమజ్జనం చేయరట. తొమ్మిదిరోజుల పాటు వినాయకుడు భక్తుల నుంచి పూజలను అందుకున్న తరువాత స్వామివారి విగ్రహాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన చెరకుగడలను తొలగించి.. భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. అలాగే తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో పేడ మిశ్రమంతో తయారు చేసిన వినాయకుడి విగ్రహాలను కూడా మండపాల్లో ఏర్పాటు చేశారు నిర్వాహకులు. మనం రోజూ ఇళ్లల్లో వినియోగించే చాపలు, బుట్టలు, గంపలతో గణేషుడి విగ్రహాన్ని తయారు చేశారు భక్తులు.












Click it and Unblock the Notifications