చలి-పులి: గత 22 ఏళ్లల్లో అక్కడ ఎప్పుడూ లేనంత చలి.. ఎంతో తెలుసా..?
ఉత్తర భారతాన్ని చలి వణికిస్తోంది. మధ్యాహ్నం అయినా సరే ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం పడిపోయింది. ఢిల్లీ నగరాన్ని మంచు దుప్పటి కప్పేసింది. మంగళవారం రాత్రి ఉష్ణోగ్రత అతి తక్కువగా 9 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు భారత వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. ఇక గరిష ఉష్ణోగ్రత కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య తేడా 1.8 డిగ్రీల సెల్సియస్గా ఉందంటే ఢిల్లీ వాసులు మంగళవారం రాత్రి ఎలా వణికిపోయి ఉంటారో ఊహించొచ్చు. ఇలాంటి అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు 1997లో మాత్రమే రికార్డు అయ్యాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఇక 22 ఏళ్ల క్రితం ఢిల్లీలో అత్యల్పంగా 12.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ఆ తర్వాత మంగళవారం రోజున 9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. బుధవారం కూడా ఇదే పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక ఆకాశంలో మేఘాలు దట్టంగా ఉండటంవల్ల సూర్యకిరణాలు కూడా భూమిని తాకే పరిస్థితి లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఇక వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల డిసెంబర్ 18న ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వెదర్ ఎక్స్పెర్ట్స్ చెబుతున్నారు.
గత కొన్ని రోజులుగా గాలిలో కాలుష్యంతో బాధపడుతున్న ఢిల్లీ వాసులకు కాస్త ఊరట లభించింది.వాతావరణం చల్లబడటంవల్ల గాలిలో నాణ్యత కూడా పెరిగింది. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 242గా ఉన్నింది. ఇక బుధవారం ఢిల్లీలో 14 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గాలిలో తేమ 81శాతం ఉండగా గాలిలో నాణ్యత కూడా పెరిగిందని చెప్పారు. ఇక మంచు కప్పేయడంతో దారి కనపడక వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత వారం ఢిల్లీ నగరంలో భారీ వర్షాలు కురిశాక ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అదే సమయంలో ఉష్ణోగ్రతలు కూడా బాగా పడిపోయినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు ఉత్తర భారతంలో చలి క్రమంగా పెరుగుతోంది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో విపరీతంగా మంచు కురుస్తోంది. ఇక జమ్మూ కశ్మీర్లోని ద్రాస్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్లోకి జారుకున్నాయి. ద్రాస్ ప్రాంతంలో మైనస్ 22 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లడఖ్లో కూడా మైనస్ 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.