ఆమె డాక్టర్ కాదు.. పేదల 'మదర్': 69ఏళ్లుగా వైద్య వృత్తిలో.. ఇప్పటికీ అదే తపన!
1948 నుంచి ఇప్పటి వరకు అంటే 69ఏళ్లుగా వైద్య వృతిలో ఆమె నిర్విరామంగా సేవలు అందిస్తూనే ఉన్నారు.
వయసు మీద పడ్డా.. ఆమె ధృఢ సంకల్పానికి అవేవి అడ్డురాలేదు. డబ్బు కోసం ఆమె ఎప్పుడూ వెంపర్లాడలేదు. జీవితాంతం మానవ సేవలోనే తరించిన మదర్ థెరిసాను తలపించే మరో మదర్ ఈ డాక్టర్. డాక్టర్ భక్తి యాదవ్.. 1948నుంచి నేటి వరకు ఎన్నో వేల మందికి ఉచితంగా వైద్య చికిత్సలు అందించిన గ్రేట్ డాక్టర్.
చిన్న గాయానికి చికిత్స చేసేందుకే.. వేలకొద్ది ఫీజులు వసూలు చేసే డాక్టర్లున్న సమాజంలో.. పేదలకు ఉచితంగా చికిత్స అందిస్తూ వారి పాలిట నిజమైన దైవం అయ్యారు. 91ఏళ్ల వయసులో.. వణుకుతున్న చేతులతో ఆమె ఇప్పటికీ వైద్య చికిత్సల్లో తలమునకలై ఉన్నారంటే.. వృత్తి పట్ల ఆమె ఆరాధన, నిబద్దత ఎంత చిత్తశుద్దితో కూడుకున్నదో అర్థం చేసుకోవచ్చు.
మరో విశేషమేంటంటే.. మన దేశంలో మొదటి మహిళా ఎంబీబీఎస్ డాక్టర్ భక్తి యాదవ్. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్కు చెందిన గైనకాలజిస్ట్ భక్తి యాదవ్ తన వద్దకు వైద్యం కోసం వచ్చిన గర్భిణులకు దాదాపుగా చాలా ఎక్కువ మందికి నార్మల్ డెలివరీ చేయడానికి కృషి చేస్తున్నది.
నేటితరం డాక్టర్లు మనసుపెట్టి వైద్యం చేయడం లేదని.. వైద్యాన్ని వ్యాపారం చేసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. 1948 నుంచి ఇప్పటి వరకు అంటే 69ఏళ్లుగా వైద్య వృతిలో ఆమె నిర్విరామంగా సేవలు అందిస్తూనే ఉన్నారు. మధ్యప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంత మహిళలకు కూడా భక్తి యాదవ్ వైద్య సేవలు అందిస్తున్నారు.
భక్తి యాదవ్ వద్ద వైద్య చికిత్స్ కోసం ఇప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి వందల మంది తరలివస్తుంటారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం అన్సంగ్ లీడర్స్ కేటగిరీలో భక్తి యాదవ్ కు 2017సంవత్సరానికి గాను పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది.
ఏదేమైనా 60ఏళ్లు దాటగానే విశ్రాంత జీవితాన్ని అనుభవించాలన్న ఆలోచనకు బదులు.. తుది శ్వాస వరకు వైద్య సేవలు అందించాలన్న భక్తి యాదవ్ తాపత్రయం.. అందునా పేదల కోసం ఇంకా చేయాలన్న ఆమె తపనకు సలాం చెప్పాల్సిందే.