24 గంటల్లో 941 కేసులు, 37 మరణాలు: లాక్డౌన్ మరింత కఠినం: కేంద్రం
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో గత 24 గంటల్లో 941 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 37 కరోనా మరణాలు సంభవించాయని ఆయన వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2.90 లక్షల మందికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించగా, 12,380 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి తెలిపారు. ఇప్పటి వరకు 1489 మంది బాధితులు కోలుకోగా, 414 మంది మృతి చెందినట్లు చెప్పారు.

దేశంలో 325 జిల్లాల్లో కరోనా కేసులు లేవని లవ్ అగర్వాల్ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఎక్కడా అత్యవసరాలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మేకిన్ ఇండియా ద్వారా వైద్య పరికరాలు తయారీపై దృష్టి సారించామని తెలిపారు. లాన్డౌన్లో పనిచేసే సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు.
లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలను కోరినట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. ఏప్రిల్ 20 తర్వాత గ్రీన్ జోన్ ప్రాంతాల్లో కొన్ని రంగాలకు వెసులుబాటు కల్పించేందుకు అవకాశాలున్నాయని చెప్పారు. వలస కూలీలు, కార్మికులకు ఆహారం, వసతి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ మే 3 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఏప్రిల్ 20 తర్వాత కరోనా ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సడలింపులుంటాయనే సంకేతాలు ఇచ్చారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించకుండా కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications