మంత్రుల ఘోర ఓటమి- రెండు చోట్లా ఓడిన మరో అమాత్యుడు: లిస్ట్ ఇదే
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని అందుకుంది. తాజా సమాచారం ప్రకారం- 136 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇందులో పలు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. అధికార భారతీయ జనతా పార్టీ 65 నియోజకవర్గాలకే పరిమితమైంది. పలువురు మంత్రులు ఓటమిపాలయ్యారు.
కర్ణాటకలో విజయం సాధించడానికి కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా శ్రమించింది. ఏఐసీసీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గె, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య.. పార్టీ శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేయగలిగారు. హైకమాండ్ మొదలుకుని కిందిస్థాయి కార్యకర్త వరకు క్యాడర్ను సమన్వయం చేసుకోగలిగారు.

బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పర్యటించినా ఎలాంటి ప్రభావం చూపలేదనేది ఈ ఫలితాలు స్పష్టం చేస్తోన్నాయి. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంత్రివర్గంలో ఏకంగా 11 మంది ఓటమిపాలయ్యారంటే- బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. మోదీ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు పరాజయాన్ని చవి చూశారు. ఓటర్ల మైండ్సెట్ను మోదీ మార్చలేకపోయారు.
కర్ణాటక కేబినెట్లో బసవరాజ్ బొమ్మైను కూడా కలుపుకొంటే మొత్తం 23 మంత్రులు ఉండగా.. వారిలో డజను మందే గెలిచారు. మరో 11 మంది ఓడిపోయారు. గెలిచిన వారిలో ముఖ్యమంత్రి బొమ్మై- షిగ్గావ్, అరగ జ్ఞానేంద్ర -తీర్థహళ్లి, సీసీ పాటిల్- గదగ్, ప్రభు చౌహాన్- ఔరద్, ఎస్టీ సోమశేఖర్- యశ్వంత్పురా, బైరాతి బసవరాజ్- కృష్ణరాజపుర, గోపాలయ్య- మహాలక్ష్మి లేఅవుట్, శశికళ జొళ్లె- నిప్పాణి, సునీల్ కుమార్-కర్కళ, మునిరత్న- రాజరాజేశ్వరినగర, శివరామ్ హెబ్బార్- యల్లాపూర్ ఉన్నారు.
ఓడిపోయిన మంత్రుల్లో బీఎస్ శ్రీరాములు- బళ్లారి, మధుస్వామి- చిక్కనాయకనహళ్లి, గోవింద కరజోల్- ముధోల్, డాక్టర్ కే సుధాకర్- చిక్బళ్లాపురా, ఎంటీబీ నాగరాజ్- హొస్కొటే, బీసీ పాటిల్- హిరెకరూర్, మురుగేశ్ నిరాణి- బీళగి, కేసీ నారాయణగౌడ- కృష్ణరాజపేటె, బీసీ నగేష్- తిప్టూర్, శంకర్ పాటిల్-నవల్గుండ్ ఉన్నారు. మరో మంత్రి వీ సోమణ్న రెండు చోట్ల పోటీ చేసి ఓటమిపాలయ్యారు.












Click it and Unblock the Notifications