బాలుడిని మింగేసిన మ్యాన్ హోల్: శాపనార్థాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పెద్ద అపవాదు మూటకట్టుకునింది. స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న బాలుడు తెరిచిన మ్యాన్ హోల్ లో పడి సజీవ సమాధి అయ్యాడు.
లలిత పార్క్ సమీపంలో నివాసం ఉంటున్న లాభాంశ్ (12) అనే బాలుడు ఢిల్లీలోని మిలీనియమ్ బస్సు డిపో సమీపంలోని స్కూల్ లో విద్యాభ్యాసం చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం సాటి విద్యార్థులతో కలిసి స్కూల్ సమీపంలో ఆడుకుంటున్నాడు.
రోడ్డు పక్కన మునిసిపాలిటి సిబ్బంది మరమత్తుల పనుల కోసం మ్యాన్ హోల్ తెరిచారు. తరువాత మ్యాన్ హోల్ మూసిపెట్టకుండా అలాగే విదిలిపెట్టి వెళ్లిపోయారు. లాభాంశ్ ఆడుకుంటున్న సమయంలో మ్యాన్ హోల్ లో పడిపోయాడు.
సాటి విద్యార్థులు భయంతో పరుగు తీసి స్కూల్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునే లోపు బాలుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. లాభాంశ్ మృతదేహాన్ని బయటకు తీశారు.
లాభాంశ్ తండ్రి ఒక సంవత్సరం క్రితం మరణించాడు. అప్పటి నుంచి ఆమె తల్లి ఇళ్లలో పాచిపని చేస్తూ కుమారుడిని పోషిస్తూ చదివిస్తున్నది. ఒక్కగానొక్క కొడుకు దూరం కావడంతో ఆమె రొదనతో ఆప్రాంతం దద్దరిల్లింది.
మునిసిపల్ సిబ్బంది నిర్లక్షం కారణంగానే బాలుడు మరణించాడని కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. బాలుడి బంధువులు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు.