యూపీలో దారుణం: యోగి జిందాబాద్: నడిరోడ్డులో కాల్చి చంపిన ఎస్పీ నేత
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభిమాని అయిన వినికేత్ అనే యువకుడు యోగి జిందాబాద్ అంటూ నినాదాలు చెయ్యడంతో సమాజ్ వాదీ పార్టీ నేత శిశుపాల్ సింగ్ అతన్ని నడిరోడ్డులో రివాల్వర్ తో కాల్చి చంపేశాడు.
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభిమాని అయిన యువకుడు యోగి జిందాబాద్ అంటూ నినాదాలు చేసినందుకు సహనం కోల్పోయిన సమాజ్ వాదీ పార్టీ నాయకుడు రివాల్వర్ తో అతన్ని నడిరోడ్డులో కాల్చి చంపేశాడు.
అంతే కాకుండా సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు ఆ యువకుడి ఇంటిని ధ్వంసం చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ఆస్కోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధాన్ అనే ప్రాంతంలో జరిగింది. మధాన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వినికేత్ (17) అనే యువకుడు హత్యకు గురైనాడు.
మధాన్ ప్రాంతంలో సమాజ్ వాదీ పార్టీ నాయకుడు శిశుపాల్ సింగ్ నివాసం ఉంటున్నాడు. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న వినికేత్ అనే యువకుడు తన ఇంటి ముందు నిలబడి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
అదే సమయంలో అటువైపు వెలుతున్న సమాజ్ వాదీ పార్టీ నేత శిశుపాల్ సింగ్ నా ముందే మా ప్రత్యర్థి అయిన యోగి ఆదిత్యనాథ్ కు మద్దతుగా నినాదాలు చేస్తావా, నీకు ఎంత ధైర్యం అంటూ జోబులో ఉన్న రివాల్వర్ తీసుకుని నడిరోడ్డులో వినికేత్ ను కాల్చి చంపేశాడు.
శిశుపాల్ సింగ్ అనుచరులు వినికేత్ ఇంటి మీద దాడి చేసి చేతికి చిక్కిన వస్తువులు ధ్వంసం చేశారు. రాజకీయ కక్షల కారణంగా ఓ యువకుడి జీవితం బలి అయ్యింది. ఉత్తరప్రదేశ్ లో గూండాయిజం ఏ స్థాయిలో ఉందో ఈ ఒక్క ఉదాహరణ చాలు. స్థానిక పోలీసులు సమాజ్ వాదీ పార్టీ నేత శిశుపాల్ సింగ్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.