తల్లిని చెట్టుకు కట్టేసి, 20 సంవత్సరాల యువతి గ్యాంగ్ రేప్
ముజఫర్ నగర్: పొలంలో పనులు చేసుకుంటున్న 20 సంవత్సరాల యువతిని ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. షామిల్ జిల్లాలోని సకోటి గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
సకోటి గ్రామంలో 20 సంవత్సరాల యువతి నివాసం ఉంటోంది. ఈమె ఈ నెల (మే) 25వ తేదిన పొలంలో పని చేస్తున్న తల్లికి సహాయం చెయ్యడానికి వెళ్లింది. తల్లి, కుమార్తె ఇద్దరు పొలంలో పనులు చేసుకుంటున్నారు. ఆ సందర్బంలో ముగ్గురు యువకులు అక్కడికి వెళ్లారు.
యువతిని కిడ్నాప్ చెయ్యడానికి ప్రయత్నించారు. ఆ సందర్బంలో ఆమె తల్లి అడ్డుపడింది. రెచ్చిపోయిన నిందితులు తల్లిని చెట్టుకు కట్టి వేశారు. అనంతరం యువతిని ఎత్తుకు వెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు తల్లిని విడిపించారు.
మరో గ్రామంలో నిర్బందంలో ఉన్న యువతిని గురువారం గ్రామస్తులు రక్షించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి మీద అత్యాచారం చేసిన నిందితులలో ఒక మైనర్ ఉన్నాడని పోలీసులు చెప్పారు. బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దరు నిందితులు సచిన్, రజనీష్ లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు.