అప్పటి దాకా షూటింగులో..: కన్నడ నటి అనుమానాస్పద మృతి
కన్నడ జూనియర్ ఆర్టిస్టు పద్మావతి (44) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. యలహంక సమీపంలోని ఓ భవనంలో సోమవారం సాయంత్రం షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
బెంగళూరు: కన్నడ జూనియర్ ఆర్టిస్టు పద్మావతి (44) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. యలహంక సమీపంలోని ఓ భవనంలో సోమవారం సాయంత్రం షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ధనుష్ తమిళ చిత్రం వీఐపీకి రీమేక్గా తెరకెక్కిస్తున్న చిత్రంలో పద్మావతి నటిస్తున్నారు. దాదాపు 120 మంది బృందంతో సోమవారం సాయంత్రం చిత్రం షూటింగ్ జరిగింది. సాయంత్రం ఐదున్నర గంటలకు ప్యాక్అప్ సమయంలో పద్మావతి సెట్లో లేదని గుర్తించారు.
వెంటనే ఆమె కోసం వెతకగా నిర్మాణంలో ఉన్న మరో భవనం వద్ద ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమె మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం యలహంక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పద్మావతి జక్కూర్లో ఉంటున్నారు. పద్మావతి సాయంత్రం దాకా షూటింగులో పాల్గొన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆమె మిస్ అయినట్లు ఎవరూ గుర్తించలేదు.
పద్మావతి కనిపించలేదని రాత్రి 9 గంటలకు తమకు సమాచారం వచ్చిందని పోలీసులు చెప్పారు. పద్మావతి మధ్యాహ్నం మూడు గంటల నుంచి తనకు కనిపించలేదని ఆమె స్నేహితురాలు చెప్పారు. దీంతో పద్మావతి మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, 7 నవంబర్ 2016న మస్తిగుడి సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు జూనియర్ నటులు మృతి చెందిన విషయం తెలిసిందే.