Nipah Virus కలకలం: వైరస్ సోకిన బాలుడు మృతి
కేరళలో నిపా వైరస్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా, రాష్ట్రంలో నిపా వైరస్ సోకిన 14ఏళ్ల బాలుడు ప్రాణాలు కల్పోయాడు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు కేరళ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఆదివారం వెల్లడించారు. అతడికి నిపా వైరస్ సోకినట్లు నిర్ధరించిన కొన్ని గంటల వ్యవధిలోనే మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
మళప్పురం జిల్లాలోని పండిక్కడ్కు చెందిన 14ఏళ్ల బాలుడికి నిపా వైరస్ సోకినట్లు శనివారం వెల్లడించారు వీణా జార్జ్. పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ విషయాన్ని నిర్ధరించిందని, ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్పై ఆ బాలుడు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

బాధితుడిని కోజికోడ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించనున్నట్లు తెలిపారు. అతడికి ఎవరెవరు దగ్గరగా వచ్చారన్నది ఆరా తీస్తున్నట్లు చెప్పారు. ఇంతలోనే బాలుడు మృతిచెందాడు. అంతర్జాతీయ నిబంధనలు పాటించి అంత్యక్రియలు నిర్వహిస్తామని వీణాజార్జ్ చెప్పారు. దీనిపై బాలుడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్ మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.
కాగా, నిపా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది పందులు, గబ్బిలాలు వంటి జంతువులు, పక్షుల నుంచి మనుషులకు వ్యాపించే జూనోటిక్ వ్యాధి. నిపా సాధారణంగా జంతువుల నుంచి లేదా కలుషితమైన ఆహారం ద్వారా మానవులకు వ్యాపిస్తుంది, అయితే ఇది నేరుగా వ్యక్తుల మధ్య కూడా వ్యాపిస్తుంది.
దీని లక్షణాలలో తీవ్రమైన జ్వరం, వాంతులు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఉన్నాయి. అయితే తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛలు, మెదడు వాపులు ఉండవచ్చు. దీని ఫలితంగా కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది కాగా, నిపాకు వ్యాక్సిన్ లేకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications