సీఎంగా.. ప్రధానిగా ఇలా: గుజరాత్లో తగ్గిన మోడీ ప్రతిష్ట, మంచి వ్యూహంతో షాకిస్తున్న కాంగ్రెస్
Recommended Video
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం, ఆయన గుజరాత్ను పాలించడం కావడం ఓ వైపు, ఉద్యమ నాయకులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడం మరోవైపు.. జరుగుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.
గుజరాత్ ఎన్నికలు: ఏబీపీ, సీఎస్ డీఎస్ పోల్ సర్వే యూటర్న్, మోడీ, అమిత్ షాకు!
ఉద్యమ నాయకులు జిగ్నేష్, హార్దిక్ పటేల్ వంటి వారి మద్దతు ఉన్నందున బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందని, బీజేపీ ఓడినా ఆశ్చర్యం లేదని తొలుత భావించారు. ఆ తర్వాత బీజేపీ గెలుపు నల్లేరు మీద నడక అని వార్తలు వచ్చాయి. అనంతరం బీజేపీ గెలుస్తుంది కానీ సీట్లు తగ్గుతాయని సర్వేలు తేల్చాయి.
గుజరాత్ సీఎంగా, ప్రధానిగా మోడీ
తాజాగా, గుజరాత్లో బీజేపీకి గట్టి షాక్ తగులుతుందని, ఆ పార్టీకి వంద లోపు సీట్లు వస్తాయని ఓ సర్వేలో తేలింది. ఈ విషయం పక్కన పెడితే గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్న మోడీకి, ప్రధాని మోడీకి మధ్య తేడా స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు. గుజరాత్ సీఎంగా మోడీ హవా కనిపించిందని, ప్రధానిగా ఆయన ప్రతిష్ట మసకబారుతోందని అంటున్నారు.
మోడీ పాపులారిటీ బాగా తగ్గుతోంది
గుజరాత్లో మూడు నెలల్లోనే ప్రధాని మోడీ పాపులారిటీ బాగా తగ్గిందని సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాది ఆగస్టు నెలలో చేసిన సర్వేలో మోడీకి 82 పాయింట్లు వచ్చాయి. నవంబర్లో చేసిన సర్వేలో 64 పాయింట్లు వచ్చాయి. 18 పాయింట్లు తగ్గాయి.
రాహుల్ గాంధీ ప్రతిష్ట పెరిగింది
అదే సమయంలో రాహుల్ గాంధీ ప్రతిష్ట పెరిగిందని తేలింది. ఆయనకు ఈ ఏడాది ఆగస్టు నెలలో 40 పాయింట్లు వస్తే తాజా సర్వేలో 57 పాయింట్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీ సోమవారమే ఏఐసీసీ అధ్యక్షులుగా నామినేషన్ వేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహమే అని చెప్పవచ్చు.
బీజేపీపై వ్యూహాత్మకంగా దెబ్బ
గుజరాత్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. బీజేపీని వ్యూహాత్మకంగా దెబ్బతీస్తోంది. రాహుల్ గాంధీ తాను హిందువునే అని చెప్పుకుంటూ ఆలయాలను సందర్శిస్తున్నారు. మరోవైపు మోడీ తన ప్రవర్తనతో స్వచ్ఛమైన హిందువుగా వ్యవహరించడం లేదని చెబుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా హిందువు కాదని, ఆయన జైన్ అని ప్రచారం చేశారు.