మరో అల్పపీడనం - వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవుగా..!!
భువనేశ్వర్: ఇప్పటికే ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షపాతం నమోదైంది. పొరుగునే ఉన్న తమిళనాడు అతలాకుతలమైంది. 26 జిల్లాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. చెన్నై సహా దక్షిణ తమిళనాడులోని అనేక జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేని వర్షాల వల్ల పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సముద్ర తీర ప్రాంతాలన్నీ అల్లకల్లోలంగా మారాయి.
దీని బారి నుంచి కోలుకోక ముందే- మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఈ నెల 16వ తేదీ నాటికి బంగాళాఖాతంలో ఉపరితలంపై అల్పపీడనం ఏర్పడటానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. నైరుతి బంగాళాఖాతం- ఈశాన్య శ్రీలంక తమిళనాడు తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో అప్పర్ ట్రోపోస్పిరిక్ వరకు ఇది విస్తరించి ఉందని పేర్కొంది.
క్రమంగా ఇది తమిళనాడు-పుదుచ్చేరి, కేరళ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని వాతావరణం కేంద్రం పేర్కొంది. ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్పట్లు తెలిపింది. కొత్తగా ఏర్పడనున్న అల్పపీడన ప్రభావం ఈ నెల 18వ తేదీ వరకు ఉండొచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీ దక్షిణ ప్రాంత జిల్లాలు, రాయలసీమ, ఉత్తర తమిళనాడుల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది.
ఇప్పటికే తమిళనాడు దక్షిణ ప్రాంతాల్లో అసాధారణ వర్షం కురిసింది. చెన్నై, కాంచీపురం, రాణిపేట, రాయవేలూరు, తిరువళ్లూరు, విల్లుపురం, తిరువరూర్, మైలాడుదురై, నీలగిరి, థేని, కరూర్, పుదుక్కోట్టై, పెరంబలూరు, మధురై, అరియలూర్, తిరువణ్ణామలై, రామనాథపురం, కడలూరు, కాళ్లకురిచ్చి, దిండిగల్, కారైక్కాల్పై వర్ష ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఆయా ప్రాంతాల్లో అసాధారణ వర్షపాతం నమోదైంది. చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది.