అప్పుడేపుట్టిన పాప మృతి: వైద్యుడిపై హత్యాయత్నం
మాల్దా: పుట్టిన పసిపాప మరణించడానికి కారణం అయ్యారని ఆరోపిస్తూ వైద్యుడిపై హత్యాయత్నం చేసిన సంఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. తీవ్రగాయాలైన వైద్యుడు ఐసీయులో చికిత్స పొందుతున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.
పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మాల్దాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో జయదీప్ మంజుదార్ ఉద్యోగం చేస్తున్నారు. ఈయన ఆసుపత్రి బ్లాక్ మెడికల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. 24 సంవత్సరాల మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఆదివారం ఆసుపత్రికి తరలించారు.

ఆమెను పరిశీలించిన జయదీప్ మంజుదార్ వెంటనే ఆమెను మౌనిక్ చౌక్ రూరల్ ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని చెప్పారు. జయదీప్ సూచన మేరకు మహిళను మౌనిక్ చౌక్ రూరల్ ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గం మద్యలో ఆ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
అయితే పుట్టిన వెంటనే పసిపాప మరణించింది. డాక్టర్ వేరే ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని చెప్పడం వల్లే పసిపాప మరణించిందని భావించిన మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు కర్రలు, ఇనుప రాడ్లు తీసుకుని వెళ్లి డాక్టర్ జయదీప్ మంజుదార్ మీద దాడి చేశారు. తీవ్రగాయాలైన జయదీప్ పరిస్థితి విషమంగా ఉందని, దాడి చేసిన కొందరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications