రెచ్చిపోతున్న లష్కరే: జమ్మూ కాశ్మీర్ లో హై అలర్ట్
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో హై అలర్ట్ ప్రకటించారు. పాకిస్థాన్ తో పాటు పాక్ అక్రమిత కాశ్మీర్ నుంచి ఉగ్రవాదులు చొరబడకుండా అధికారులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు. మిలటరి బలగాలు, పోలీసులు సంయుక్తంగా గస్తీ ముమ్మరం చేశారు.
జమ్ము కాశ్మీర్ లోని కుల్గాం ప్రాంతంలో గురువారం ఉదయం భారత్ భద్రతాదళాలు జరిపిన ఎన్ కౌంటర్ లో పాకిస్థాన్ కు చెందిన లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది కమాండర్ అబూ ఖాసీం అంతం అయిన విషయం తెలిసిందే.
ఉధంపూర్ దాడుల ఘటనకు అబూ ఖాసీం ప్రధాన సూత్రదారి అని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ప్రాణాలతో పట్టుబడిన పాక్ ఉగ్రవాది నవెద్ సైతం అబూ ఖాసీం ప్రధాన సూత్రధారి అని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులకు చెప్పాడు.

అప్పటి నుంచి అబూ ఖాసీం కోసం అధికారులు వేట ప్రారంభించారు. కచ్చితమైన ఆదారాలు సేకరించి గురువారం ఉదయం ఎన్ కౌంటర్ లో అబూ ఖాసీంను అంతం చేశారు. 2013లో జమ్మూ కాశ్మీర్ లోని హైదర్ పురలో భారత్ మిలటరి బలగాల మీద పాక్ ఉగ్రవాదులు దాడులు చేశారు.
హైదర్ పుర దాడి ప్రధాన సూత్రధారి అబూ ఖాసీం అని వెలుగు చూసింది. ఇప్పుడు అబూ ఖాసీం ఎన్ కౌంటర్ లో అంతం కావడంతో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు ప్రతి దాడులు చేసే అవకాశం ఉందని ఐబి వర్గాలు హెచ్చరించాయి.
పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు రాకుండ జాగ్రత్తలు తీసుకోవాలని భద్రతాదళాలకు సూచించారు. ఈ హెచ్చరికలతో జమ్మూ కాశ్మీర్ లో హై అలర్ట్ ప్రకటించారు. సున్నితమైన ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదని స్థానికులను హెచ్చరించారు.












Click it and Unblock the Notifications