గోల్డెన్ టెంపుల్లో ఖడ్గాన్ని తాకే యత్నం: యువకుడిని చితకబాదిన గుంపు, మృతి
చండీగఢ్: అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో అపవిత్ర కార్యానికి ప్రయత్నించాడనే నెపంతో ఒక వ్యక్తిని అక్కడే ఉన్న ఓ గుంపు కొట్టి చంపింది. ఈ మేరకు వివరాలను పోలీసులు శనివారం తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం.. బాధిత వ్యక్తి రోజువారీ సాయంత్రం ప్రార్థన సమయంలో గోల్డెన్ టెంపుల్ లోపల రైలింగ్ మీదుగా దూకి, సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్ ముందు ఉంచిన కత్తిని తాకడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అడ్డుకున్న కొందరు సిక్కుల గుంపు.. అతడ్ని తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
'ఈ సాయంత్రం ప్రార్థనల సమయంలో, ఒక వ్యక్తి కంచె దూకి పరివేష్టిత ప్రాంతంలోకి ప్రవేశించాడు. సిక్కులు ఆ సమయంలో ప్రార్థనలు చేసి నమస్కరిస్తున్నారు' అని అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పర్మీందర్ సింగ్ భండాల్ చెప్పారు.
'తలపై పసుపు గుడ్డ కట్టుకున్న సుమారు 20 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల యువకుడు కంచె దూకాడు... లోపల ఉన్న వ్యక్తులు అతనిని పట్టుకుని కారిడార్కు తీసుకెళ్లారు, అక్కడ అతనిపై తీవ్రంగా దాడి చేశారు. దీంతో అతను మరణించాడు' అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పర్మీందర్ సింగ్ తెలిపారు.
'అతను ఒంటరిగా ఉన్నాడు. ఆ ప్రాంతంలో చాలా సీసీటీవీ కెమెరాలు ఉన్నందున అన్ని వివరాలు వెల్లడి చేయబడతాయి. మా బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి, ఫుటేజీని జల్లెడపడుతున్నాయి. రేపు పోస్ట్మార్టం చేయబడుతుంది. అతను ఎక్కడి నుండి వచ్చాడో మేము ధృవీకరిస్తాము' అని పర్మీందర్ సింగ్ భండాల్ తెలిపారు.