అటెన్షన్ ప్లీజ్ : రైలు ప్రయాణికులూ.. మీరిది తెలుసుకోవాల్సిందే
వరంగల్ : వద్దన్నా వినలేదు.. బలవంతపెట్టి మరీ బాదం పాలు తాగించారు. ఆ తర్వాత.. ఏమైందో తెలియడానికి అతను స్పృహలో లేడు. భోపాల్ లో ఆవహించిన మత్తు.. రామగుండం వచ్చేసరికి కొంచెం దిగింది. తీరా.. చూస్తే.. ఒంటి మీద ఆభరణాలతో పాటు ల్యాప్ టాప్, సెల్ ఫోన్ మాయం. రైలు ప్రయాణంలో ఓ వ్యాపారిని నిలువు దోపిడి చేసిన అగంతకుల ఘనకార్యమిది.
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా కట్టరాంపూర్ నివాసి అయిన పారిపల్లి మనోహర్ అనే వ్యాపారవేత్త వ్యాపార విషయమై న్యూఢిల్లీ వెళ్లాడు. అనంతరం తిరుగు ప్రయాణంలో మంగళవారం నాడు న్యూఢిల్లీ నుంచి కేరళ ఎక్స్ప్రెస్లో వరంగల్ కు బయలుదేరాడు. అయితే రాత్రి 8గం.ల సమయంలో రైలు భోపాల్ కు చేరుకున్న తర్వాత ఇద్దరు గుర్తు తెలియని ఆగంతకులు కోచ్ లోకి చొరబడ్డారు.
ఇద్దరిలో ఒకడు వాటర్ బాటిల్స్ అమ్ముతుండడంతో.. ఓ వాటర్ బాటిల్ కొనుక్కున్నాడు మనోహర్. అనంతరం తన వెంట తీసుకొచ్చిన బాదం పాలను తాగాలని రెండో అగంతకుడు మనోహర్ ను ఇబ్బంది పెట్టాడు. అతని బలవంతం మేరకు బాదం పాలు తాగిన మనోహర్.. క్షణాల్లో స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత రైలు రామగుండం సమీపించాక గానీ అతనికి స్పృహ రాలేదు.
ఇక చేసేదేమి లేక.. వరంగల్ చేరుకున్నాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు మనోహర్. రూ.55వేలు విలువ చేసే ఆభరణాలతో పాటు ల్యాప్ టాప్, సెల్ ఫోన్ చోరికి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మనోహర్ ఫిర్యాదు మేరకు కేసు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.