అమ్మతనానికే కళంకం: బతికుండగానే కన్నబిడ్డను స్మశానంలో పాతిపెట్టిన తల్లి
నవమాసాలు మోసి కని పెంచుకున్న బిడ్డను బ్రతికుండగానే స్మశానంలో పాతిపెట్టిన ఓ తల్లి అమ్మతనానికి కళంకం తెచ్చింది. తన ప్రాణాలు అడ్డు వేసి అయినా బిడ్డల ప్రాణాలు కాపాడాలని చూసే ఎందరో తల్లులు ఉన్న నేటి రోజుల్లో కన్నబిడ్డ పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించిన ఈ తల్లి స్థానికులను షాక్ కు గురిచేసింది.
మూడేళ్ళ కూతుర్ని బతికుండగానే పాతిపెట్టిన తల్లి
ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళితే బీహార్లోని సారన్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం మూడేళ్ల బాలికను ఆమె తల్లి మరియు అమ్మమ్మ సజీవంగా పాతిపెట్టారు. కన్నబిడ్డ అన్న కనికరం కూడా లేకుండా, నోట్లో మట్టి కుక్కి, స్మశానంలో గొయ్యి తీసి పాతిపెట్టారు. అయితే ఆమె అరుపులు విన్న స్థానిక గ్రామస్తులు బాలికను రక్షించారని పోలీసులు తెలిపారు.జిల్లాలోని కోపా పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్హా నది ఒడ్డున ఉన్న స్మశాన వాటికలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అరుపులు విని కాపాడిన స్థానికులు
కొంతమంది మహిళలు స్మశాన వాటిక సమీపంలో కట్టెలను ఏరుతున్నారని, వారు అరుపులు విని మొదట భయపడ్డారని, స్మశానం నుండి అరుపులు వినిపించడంతో దెయ్యమని వారు మొదటి భయపడ్డారని కోపా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఇక వెంటనే గ్రామస్తులు పెద్ద సంఖ్యలో స్మశానవాటిక వద్దకు చేరుకుని బ్రతికి ఉన్న వారిని సజీవంగా పాతిపెట్టారని గుర్తించారని తెలిపారు . అరుపులు వినిపిస్తున్న దగ్గరకు వెళ్లి మట్టిని తీసి చూస్తే మూడేళ్ళ పసిబిడ్డ కనిపించింది. బాలిక నోటి నిండా మట్టితో నింపబడి ఉందని చెప్పారు.
అమ్మ,అమ్మమ్మ కలిసి తనను పాతిపెట్టారన్న బాలిక
బాధితురాలిని కోపాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. బాధితురాలు తన పేరు లాలీ అని, ఆమె తల్లిదండ్రులు రాజు శర్మ, రేఖా శర్మ అని, అయితే తన గ్రామం పేరు తెలియదని చెప్పారు. తన అమ్మ మరియు అమ్మమ్మ తనను స్మశానవాటిక దగ్గరకు తీసుకువచ్చారని, తాను ఏడుస్తున్నప్పుడు, వారు నా నోటిలో మట్టిని నింపి మట్టిలో పాతిపెట్టారు అని లాలీ వైద్య అధికారులు మరియు పోలీసులకు చెప్పారు. బాలిక తల్లిదండ్రులను, గ్రామాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అసలు కన్నబిడ్డను బ్రతికుండగానే ఆ తల్లి ఎందుకు పాతిపెట్టింది అన్నది తెలియాల్సి ఉంది.