పగలు పూజారి: రాత్రి దోపిడీల రాక్షసుడు
పూణె: పగటి పూట ఆయన పూజారి. ఆధ్యాత్మిక గురువు. పెళ్లి సంబంధాలు చూసే పేరయ్యగా వ్యవహరిస్తాడు. పెళ్లిళ్లు చేస్తాడు. అయితే రాత్రి అయ్యే సరికి ఆయన చోరీలు చేస్తూ చేతివాటం చూపిస్తాడు.
ముసుగులు వేసుకుని స్నేహితులతో కలిసి పూణె నగరంలో ఇళ్లు లూటీలు, దోపిడీలు చేస్తున్నాడు. సినిమా స్టోరీని తలదన్నే విధంగా ఈ పూజారి అందరిని మాయ చేశాడు. పూజారిని పూణె పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. పూణె ఇన్స్ పెక్టర్ సుష్మా చవాన్ పూజారి వివరాలు వెల్లడించారు.
మహారాష్ణ్రలోని పూణె నగరానికి చెందిన అజయ్ మధుకర్ గైక్వాడ్ (42)బుద్ధవిహార్ ప్రాంతంలో కేర్ టేకర్ గా ఉంటూ మంచి జీవితం గడిపేవాడు. అయితే ఆయన ఇద్దరితో పరిచయం చేసుకున్న తరువాత చెడుసావాసాలకు అలవాటు పడ్డాడు.
ఎన్నో సంవత్సరాలు ఆయన ప్రజలకు ఆధ్యాత్మిక, సామాజిక అంశాలలో సలహాలు ఇచ్చాడు. కొంత కాలానికి అతనికి ముంబైకి చెందిన మదన్ విరాట్ స్వామి(24), మహమ్మద్ ఇక్బాల్ షేక్ (47)అనే ఇద్దరు పరిచయం అయ్యారు.
వీరిద్దరి మీద ముంబై, థానెలలో పలు క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. పగటి పూట పూజారిగా ఉన్న అజయ్ మధుకర్ గైక్వాడ్ వీరిద్దరితో కలిసి రాత్రి పూట ముసుగులు వేసుకుని పూణెలో పలు చోరీలు, దోపిడీలు చేశాడు. ముగ్గురు కలిసి 25 దోపిడీలు చేశారు.
ఒక సంవత్సరం క్రితం బుద్ధి తెచ్చుకున్నఅజయ్ మధుకర్ గైక్వాడ్ చోరీలు, దోపిడీలకు స్వస్తి చెప్పాడు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర కమీషన్ పద్దతిలో ఏజెంట్ గా చేరాడు. కుటుంబ సభ్యులతో కలిసి పూణె రైల్వే క్వాటర్స్ దగ్గర నివాసం ఉంటున్నాడు.
చోరీలు చేస్తున్న మహమ్మద్ ఇక్బాల్ షేక్ రెండు రోజుల క్రితం ఓ చోరీ కేసులో పోలీసులకు చిక్కాడు. అతడు తాను అజయ్ మధుకర్ గైక్వాడ్ తో కలిసి చోరీలు చేశానని చెప్పడంతో పూజారి గైక్వాడ్ ని అరెస్టు చేశామని పోలీసు అధికారి సుష్మా చవాన్ తెలిపారు.