కావేరీ చిచ్చు: 10 గంటల్లో బెంగళూరులో రూ. 75 కోట్లు బూడిద
బెంగళూరు: కావేరీ జలాలు వివాదం వలన బెంగళూరు నగరంలో జరిగిన అల్లర్లలో రూ. సోమవారం రాత్రి వరకు రూ. 75 కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. తమిళనాడులో కన్నడిగులపైన దాడి చెయ్యడాన్ని ఖండిస్తూ బెంగళూరు నగరంలో గొడవలు మొదలైనాయి.
సోమవారం సుప్రీం కోర్టు తీర్పుతో ఆ గొడవలకు అగ్నికి ఆజ్యంపోసినట్లయ్యింది. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బెంగళూరు నగరంతో సహ పలు ప్రాంతాల్లో 102 వాహనాలు ధ్వంసం అయ్యాయి.
కేవలం బెంగళూరు నగరంలో రూ. 75 కోట్ల ఆస్తినష్టం జరిగిందని అధికారులు అంటున్నారు. తమిళనాడుకు చెందిన లారీలు, ట్రక్కులు, ఆర్ టీసీ బస్సులు, కార్లను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.
మిలటరీ బలగాలు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయిందని పోలీసు అధికారులు అంటున్నారు. సోమవారం కేవలం 10 గంటల్లోనే బెంగళూరు అట్టుడికిపోయింది.
ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు తమిళనాడు బస్సులను కర్ణాటకలోకి అనుమతించడం లేదు. తమిళనాడు సరిహద్దుల్లోనే తమిళనాడు రిజిస్ట్రేషన్ నెంబర్లు ఉన్న వాహనాలు నిలిపివేస్తున్నారు.