భారత్ గర్వించే సందర్భం: ప్రధాని మోడీపై సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ పూనావాలా ప్రశంసలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) సీఈఓ ఆదర్ పూనావాలా ప్రశంసల వర్షం కురిపించారు. భారత కరోనా టీకా సిద్ధమైతే ప్రపంచ దేశాలకు అందించేందుకు సిద్ధమని ప్రధాని మోడీ హామీ ఇవ్వడం ఎంతో గర్వించదగిన విషయమని అన్నారు.
భారత్ గర్వించే సందర్భం..
ఐక్యరాజ్యసమితి వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ ఇచ్చిన హామీపై ప్రశంసిస్తూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కరోనా వ్యాక్సిన్ సిద్ధమైతే ప్రపంచ దేశాలకు అందజేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇవ్వడం భారత్కు ఎంతో గర్వించదగిన సందర్భమని పూనావాలా అన్నారు.
మోడీ నాయకత్వానికి మద్దతు..
మీ(మోడీ) నాయకత్వానికి, మద్దతుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దేశం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు భారతీయుల అవసరాలు తీర్చగలవని దీంతో స్పష్టమవుతోందని అని ఆదర్ పూనావాలా వ్యాఖ్యానించారు. కాగా, వ్యాక్సిన్ కొనుగోలు చేసి, పంపిణీ చేయడానికి ప్రభుత్వం నుంచి రూ. 80వేల కోట్లు అవసరమవుతాయని వ్యాఖ్యానించిన మరుసటి రోజే.. ఐక్యరాజ్య సమితిలో మోడీ ప్రసంగం తర్వాత ఈ మేరకు స్పందించడం గమనార్హం.

ప్రపంచ అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా సీరమ్ ఇనిస్టిట్యూట్..
కాగా, సీరమ ఇనిస్టిట్యూట్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద వ్యాక్సిన్ తయారీదారు కావడం గమనార్హం. ఆస్ట్రాజెనికా పీఎల్సీ, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్లకు మూడో దశ ట్రయల్స్ కొనసాగిస్తోంది. వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి అనంతరం ఈ సంస్థ సుమారు 1 బిలియన్ డోసులను ఉత్పత్తి చేయనుంది.
Recommended Video

ఐక్యరాజ్య సమితి వేదికపై మోడీ..
ఐక్యరాజ్యసమితి వార్షిక సర్వసభ్య సమావేశంలో శనివారం భారత ప్రధాని నరేంద్ర మోడీ 23 నిమిషాలపాటు ప్రసంగించారు. కరోనా సంక్షోభ సమయంలోనూ భారత్ 150 దేశాలకు మందుల్ని సరఫరా చేసిందని తెలిపారు. భారతదేశంలో టీకా సిద్ధమైతే కరోనాపై పోరాడేందుకు ప్రపంచ దేశాలకు అందిస్తామని, తమవంతుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక, ఐక్యరాజ్యసమితి లోపాలను ఎత్తిచూపుతూ, సంస్కరణలు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications