కమల్ హాసన్ కు వరుస షాకులు .. తమిళనాట రాజకీయాలకు గుడ్ బై చెప్తారా?
తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకువస్తానని పార్టీ పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేసి సీఎం అభ్యర్థిని అని ప్రకటించుకున్న మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తమిళనాడు ప్రజలు కొట్టిన దెబ్బకు చతికిలబడ్డాడు. ఆ తర్వాత పార్టీ నుండి పెద్ద ఎత్తున అగ్రనాయకులు రాజీనామాల పర్వం కొనసాగుతోంది. దీంతో తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది మక్కల్ నీది మయ్యం. తాజా పరిణామాల నేపథ్యంలో రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు బయట చర్చ జోరుగా సాగుతుంది.
మోడీకి దీదీ షాక్: కేంద్రంపై నిధులకు ఒత్తిడి, లేఖాస్త్రాలతో మమత మార్క్ బెంగాల్ రాజకీయం !!
ఎన్నికల ఓటమి , ఆపై అగ్ర నాయకుల రాజీనామాలతో డైలమాలో కమల్ పార్టీ
కమల్ హాసన్ రాజకీయ పార్టీ మక్కల్ నీది మయం (ఎంఎన్ఎమ్) తమిళనాడులో తమ తొలి అసెంబ్లీ ఎన్నికలలో తీవ్ర పోరాటం చేసింది. తమిళ రాజకీయాల్లో మార్పు తీసుకొస్తామని, ప్రజల్లోకి వెళ్లినా ఆ పార్టీని ఆదరించిన దిక్కులేదు. కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సమీప ప్రత్యర్థి వాసంతి శ్రీనివాసన్ మీద 1300 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు అధినేత కమల్ హాసన్ .ఇక ఈ షాక్ అలా ఉంటే, ఆ తర్వాత పార్టీలో చేరిన అగ్రనాయకులు సామూహిక రాజీనామాలకు దిగడం కమల్ హాసన్ పార్టీ కి పెద్ద దెబ్బ అని చెప్పాలి.
పార్టీలో మార్పులు చెయ్యాలనుకున్న కమల్ , కోర్ కమిటీ మీటింగ్ తర్వాత అనూహ్య మార్పులు
పార్టీ కేంద్ర పాలక మండలి ఇటీవల చెన్నైలోని వారి ప్రధాన కార్యాలయంలో సమావేశం తర్వాత పార్టీలో కీలక నేతల రాజీనామాలు వెలుగులోకి వచ్చాయి. కమల్ హాసన్ తన పార్టీ సెంట్రల్ గవర్నింగ్ బాడీ (సిజిబి) సభ్యులను వారు నిర్వహించిన సంబంధిత పదవుల నుండి రాజీనామా చేయమని కోరినట్లు సమాచారం . ఓటమికి గల కారణాలను అన్వేషిస్తున్న క్రమంలో పార్టీలో ప్రాథమిక మార్పులు చేయాలనుకున్న కమల్ హాసన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే వారి ప్రాధమిక సభ్యత్వం నుండి రాజీనామా చెయ్యమని చెప్పలేదు .
ఊహించని షాక్ ఇస్తున్న కీలక నేతలు , కమల్ పైనే విమర్శలు
సమావేశం ముగిసిన కొద్దిసేపటికే,పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్న డాక్టర్ ఆర్.మహేంద్రన్ రాజీనామా చేసి కమల్ హాసన్ పై సంచలన ఆరోపణలు చేశారు. కమల్ వ్యవహార శైలి వల్లే పార్టీకి నష్టం జరిగిందని , భవిష్యత్ లో కూడా ఆయన వ్యవహార శైలి మారుతుంది అనుకోవటం లేదని అందుకే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత వరుసగా మురుగనందం, మౌర్య, తంగవేలు, ఉమదేవి, సికె కుమారవేల్, శేఖర్, సురేష్ అయ్యర్ రాజీనామా చేసినట్లు తెలుస్తుంది .
కమల్ పార్టీని నడిపిస్తారా ? మళ్ళీ ఐదేళ్ళ వరకు కమల్ వెంట నడిచేవారెవరు
అయితే తాజా పరిణామాల నేపథ్యంలో మళ్ళీ వచ్చే ఐదేళ్ళ వరకు పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారటంతో చాలా మంది పార్టీని వీడి వెళ్తున్నారు. తమిళనాట చాలా కాలంగా అన్నా డీఎంకే , డీఎంకే లు అక్కడ రాజకీయాలను శాసిస్తున్న పార్టీలుగా మారాయి. అధికార బదిలీ కూడా ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధానంగా జరుగుతుంది. కనీసం ఒక్క స్థానం కూడా గెలవలేకపోయిన కమల్ హాసన్ పార్టీని నడిపిస్తారా? లేక రాజకీయాలకు గుడ్ బై చెప్తారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ పార్టీని నడిపిస్తే కమల్ వెంట నడిచే వారెవరో కూడా అంతు చిక్కటం లేదు.
Recommended Video
రజనీకాంత్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు .. ఇప్పుడు కమల్ ఆ పని చేస్తారా ?
ఇప్పటికే తమిళనాడులో రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించిన రజనీకాంత్ పార్టీ పెట్టకుండానే విరమించుకున్నారు. తమిళనాడు సీఎం అభ్యర్థిని ప్రకటించుకున్న కమల్ హాసన్ ఒక స్థానాన్ని కూడా గెలుచుకోకుండా పరాభవం పాలయ్యారు. దీంతో ఆయన తిరిగి సినిమాల మీద దృష్టి సారిస్తారు అన్న చర్చ కూడా ప్రధానంగా సాగుతుంది. అధికారికంగా ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్తారని ప్రకటించనప్పటికీ తమిళనాట ప్రజల్లో మాత్రం ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.