ఆటుపోట్లు: సినీ నటి నుంచి సిఎం స్థాయికి జయలలిత
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శనివారం బెంగళూరు ప్రత్యేక కోర్టు దోషి తేల్చిన విషయం తెలిసిందే. సినీ కథానాయికగా తన జీవితం మొదలుపెట్టిన జయలలిత.. క్రమంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. అన్నాడిఎంకె అధ్యక్షురాలిగా, ప్రతిపక్ష నేతగా కూడా ఆమె తమిళ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పాషించారు.
ఆమె జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. జయలలిత నాటి మైసూర్ రాష్ట్రంలోని మాండ్యా జిల్లా పండవపురా తాలూకాలోని మెల్కోటేలో 1948, ఫిబ్రవరి 24న జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జయరాం, వేదవల్లి(సంధ్య)లు. ఆ కాలంలో సంధ్య ప్రముఖ సినీ నటిగా వెలుగొందారు. జయరాం తాత మైసూరు సామ్రాజ్యంలో వైద్యునిగా పనిచేసేవారు. జయలలిత రెండేళ్ల వయస్సులోనే తండ్రి జయరాం మరణించారు. దీంతో సంధ్య బెంగళూరులోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది.
ఆ తర్వాత చెన్నై కేంద్రం సాగుతున్న తమిళ చిత్రాలలో నటించడం ప్రారంభించింది. అప్పుడే వేదవల్లి తన పేరును సంధ్యగా మార్చుకుంది. జయలలిత చెన్నైలోని సేక్క్రేడ్ హార్ట్ మెట్రిక్యూలేషన్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించింది. జయలలిత చదువులో రాణించడంతోపాటు తన తల్లి నటిస్తున్న చిత్రాలలో కూడా నటిస్తుండేది. చదువుకు ఆటంకం కలగకుండా ఆమె తల్లి చూసుకునేది. ఈ క్రమంలో ఆమె నటించిన ఈపిస్ట్లి అనే ఇంగ్లీష్ చిత్రం 1961లో విడుదలైంది.

హీరోయిన్గా ఆమె మొదటిసారిగా నటించిన కన్నడ చిత్రం చిన్నదా గంబి. ఈ చిత్రం 1964లో విడుదలైంది. ఆ తర్వాత ఏడాది తమిళంలో విడుదలైన వెన్నెరా అదాయి చిత్రంలో నటించారు. అదే ఏడాది తెలుగులో వచ్చిన ‘మనుషులు మమతలు' చిత్రంలో నటించారు. అలా జయలలిత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 140 చిత్రాల్లో నటించారు. జాతీయ అవార్డుతోపాటు పలు ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా ఆమె సొంతం చేసుకున్నారు.
ప్రముఖ సినీ నటుడు, అన్నాడిఎంకె అధినేత ఎంజి రామచంద్రన్ 1977లో తమిళనాడుకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే జయలలిత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1982 ఏఐఏడిఎంకె పార్టీలో చేరారు. 1983లో తిరుచండుర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. అయితే 1984లో ఆమెను పార్టీ తరపున రాజ్యసభకు ఎంపిక చేశారు. దీంతో ఆమె ఏఐఏడిఎంకె తరపున రాజ్యసభలో అడుగుపెట్టారు. తన పార్టీ సభలో ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు.

కాగా, 1987లో రామచంద్రన్ మరణించారు. దీంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. మొదటి వర్గానికి రామచంద్రన్ భార్య జానకీ రామచంద్రన్ నేతృత్వం వహించారు. రెండో వర్గానికి జయలలిత నాయకత్వం వహించారు. కాగా, జానకికి ఆ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. దీంతో ఆమె ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అయితే ఆమె ప్రభుత్వాన్ని అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం రద్దు చేసింది. 1989లో మళ్లీ ఎన్నికలు జరిగాయి.
1989లో బొడినాయకన్నూర్ నుంచి ఏఐఏడిఎంకె తరపున శాసనసభ్యురాలిగా జయలలిత ఎన్నికయ్యారు. ఆమె నేతృత్వంలోని పార్టీ 27 స్థానాలను కైవసం చేసుకుంది. అప్పుడు మొట్టమొదటి ప్రతిపక్ష నేతగా ఆమె రికార్డు సృష్టించారు. 1991లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఏఐఏడిఎంకె పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు గానూ 225 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ సమయంలోనే ఆమె ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 1996లో జరిగిన ఎన్నికల్లో ఆమె కేవలం నాలుగు సీట్లను మాత్రమే కైవసం చేసుకున్నారు. 2001లో మళ్లీ జయలలిత సిఎం అయ్యారు.
మళ్లీ అవినీతి ఆరోపణలు రావడంతో ఆమె పదవి నుంచి తప్పుకుని.. ఆ స్థానంలో మంత్రివర్గంలోని పన్నీరు సెల్వంను సిఎంగా నియమించారు. 2011లో ముచ్చటగా మూడోసారి జయలలిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సిఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 'అమ్మ‘ పేరిట అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే అనాటి అవినీతి ఆరోపణలపై విచారించిన బెంగళూరు కోర్టు శనివారం జయలలితను దోషిగా తేల్చింది. దోషిగా తేలడంతో ఆమెకు శిక్షపడే అవకాశం ఉంది. దీంతో మళ్లీ ఆమె ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications