స్కూల్లో విద్యార్థితో మసాజ్ చేయించుకున్న టీచర్.. వీడియో వైరల్; టీచర్ పై సస్పెన్షన్ వేటు!!
చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి, వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన టీచర్లు ఆ విషయాన్ని మరిచిపోయి, విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు సమాజంలో విద్యా వ్యవస్థ పరిస్థితిని కళ్లకు కడుతోంది. ఇలాంటి టీచర్లతో దేశం ఎలా పురోగమిస్తుంది అన్న ప్రశ్నలను రేకెత్తిస్తుంది.
ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ ప్రాధమిక పాఠశాలలో విద్యార్థులతో మసాజ్ చేయించుకున్న టీచర్
నిన్నటికి నిన్న కర్ణాటకలోని గడగ్ జిల్లాలోని పాఠశాల విద్యార్థులు నాగవి పాఠశాలలో టాయిలెట్ను శుభ్రం చేసిన ఘటన మరచిపోక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లోని ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఆమెకు మసాజ్ చేయమని బలవంతంగా విద్యార్థులతో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇలాంటి టీచర్ల వల్లే విద్యావ్యవస్థ నాశనం అవుతుంది అన్న అభిప్రాయానికి కారణంగా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఒక విద్యార్థి టీచర్ పక్కన నిలబడి ఆమెకు మసాజ్ చేస్తున్నాడు. విద్యార్థి మసాజ్ చేస్తున్న సమయంలో ఆమె ఎవరితోనో మాట్లాడుతూ, మంచి నీళ్లు తాగుతూ కనిపించారు. ఇక క్లాస్ రూమ్ లో ఉన్న విద్యార్థులు అటు ఇటు తిరుగుతూ అల్లరి చేస్తున్నా ఆమె పట్టించుకున్న దాఖలాలు లేవు. తాను ఒక టీచర్ అన్న విషయాన్ని మరిచిపోయి విద్యార్థులకు పాఠాలు బోధించకుండా క్లాస్రూమ్లో రిలాక్స్గా మహిళా టీచర్ కూర్చొని విద్యార్థులతో మసాజ్ చేయించుకుంటున్న వీడియో వైరల్ అయ్యింది.
టీచర్ ను తిట్టిపోస్తున్న నెటిజన్లు
ట్విటర్ ఖాతాలో వీడియోను షేర్ చేసి, విద్యార్థులతో చేతులు మసాజ్ చేయించుకుంటున్న ఉపాధ్యాయురాలు, హర్దోయ్ యుపి ప్రభుత్వ పాఠశాల నుండి వైరల్ వీడియో అని పేర్కొన్నారు పలువురు. ఇక ఈ వీడియో వైరల్గా మారడంతో విద్యార్థులను ఇలాంటి పనులు చేయించినందుకు నెటిజన్లు ఉపాధ్యాయురాలిని తిట్టిపోశారు. కొందరు యచేసి విద్యార్థులను ఇలాంటి పనులు చేయించవద్దు అంటూ, ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. టీచర్లు ఇలా ఉంటే విద్యార్థులు ఉత్తమ పౌరులు ఎలా అవుతారు అంటూ కొందరు ప్రశ్నించారు. ఇలాంటి టీచర్లపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
టీచర్ ను సస్పెండ్ చేసిన అధికారులు.. విచారణకు ఆదేశం
నువ్ అసలు టీచర్ వేనా అంటూ కొందరు సదరు మహిళా టీచర్ ను నిలదీశారు. ప్రభుత్వ స్కూల్స్ పరిస్థితి ఇలా ఉందని యూపీ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇక తాజా వీడియో నేపధ్యంలో విద్యాశాఖ చర్యలకు ఉపక్రమించింది. సదరు టీచర్ ఎవరు అన్నది గుర్తించిన అధికారులు ఉపాధ్యాయినిని ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన టీచర్ ఊర్మిళ సింగ్ అని గుర్తించారు. సస్పెండ్ అయిన టీచర్ ను విచారించడానికి బీఎస్ఏ కూడా దర్యాప్తు ప్రారంభించిందని అధికారులు పేర్కొన్నారు.