400 ఏళ్ళ తర్వాత ఆ గుళ్ళోకి పురుషులకు ప్రవేశం, ఎందుకో తెలుసా?
భువనేశ్వర్: 400 ఏళ్ళ తర్వాత పురాతన ఆలయంలో పురుషులకు ఆలయ ప్రవేశం దక్కింది. 400 ఏళ్ళుగా ఈ ఆలయంలోకి పురుషులకు అనుమతి లేదు.సాంప్రదాయాలను పక్కన పెట్టి తొలిసారిగా పురుషులను ఈ ఆలయంలోకి అనుమతించారు. ఈ ఆలయంలోని గర్భగుడిలోకి ఏనాడూ కూడ పురుషులకు అనుమతి లేదు.
ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని సతాభ్యా అనే గ్రామంలో పంచువారాహి దేవత ఆలయం ఉంది. ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం ఉందని స్థానికుల నమ్మకం. ఈ ఆళయంలో పురుషులకు అనుమతి లేదు. వివాహితులైన ఐదుగురు దళిత మహిళలు ప్రతి రోజూ ఆలయంలో నిత్య శుద్ది పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా బంగాళాఖాతంలో నీటి మట్టం పెరుగుతోంది. దీని ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఒడిశా విపత్తు నిర్వహణల శాఖ, ప్రపంచబ్యాంకులు సంయుక్తంగా ఓడిఆర్పీ పేరుతో పునరావాస కార్యక్రమాలను చేపట్టాయి.
ఈ క్రమంలోనే సతాభ్యా గ్రామాన్ని తరలించాయి. అయితే తమ గ్రామాన్ని ఇంతకాలం పాటు రక్షించిన పంచువారాహి దేవాలయాన్ని కూడ తరలించాలని గ్రామస్తులు నిర్ణయం తీసుకొన్నారు. సతాభ్యా నుంచి బాగాపాటియా 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ అధికారుల సాయంతో గ్రామస్థులు కొత్త ఆలయం నిర్మించుకున్నారు. కానీ, దేవాలయంలో ఉన్న ఐదు విగ్రహలను తరలించడం మహిళలకు కష్టంగా మారింది.
ఐదు భారీ రాతి విగ్రహాలు ఒక్కోక్కటి టన్నున్నర బరువు ఉన్నాయి. దీంతో వాళ్లు పురుషుల సాయం తీసుకున్నారు. ఏప్రిల్ 20వ తేదీన ఐదుగురు వ్యక్తుల సాయంతో విగ్రహాలను తొలగించి.. పడవ ప్రయాణం ద్వారా కొత్త ఆలయానికి తరలించారు. శుద్ధి కార్యక్రమం నిర్వహించి కొత్తగా నిర్మించిన ఆలయంలో పూజలు నిర్మించారు. అయితే ఎట్టకేలకు 400 ఏళ్ళ తర్వాత ఈ ఆలయంలోకి విగ్రహాల తరలింపు కారణంగా పురుషులకు ప్రవేశం లభించింది.