పెళ్లికి నో చెప్పిందని.. ప్రేయసిని పోలీసులకు పట్టించాడు.. చివరికి ఏమైందంటే..
వాళ్లిద్దరూ కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. రెండు కుటుంబాలకు కూడా అభ్యంతరం లేదు. కానీ పెళ్లి చేసుకోడానికి మాత్రం ఆమె నిరాకరించింది. ఎన్నిసార్లు బతిమాలినా ఒప్పుకోలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ ప్రియుడు పక్కాగా స్కెచ్ వేసి.. ప్రేయసిని పోలీసులకు పట్టించాడు. అతితెలివితో చేసిన పనికి అతను కూడా బుక్కైపోయాడు. హర్యానాలోని సిర్సాలో చర్చనీయంగా మారిన ఈ క్రైమ్ స్టోరీ గురించి పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..
ఇద్దరూ దొంగలే..
అంబాలా జిల్లాకు చెందిన వినోద్.. కొంతకాలంగా సిర్సాలో ఉంటున్నాడు. స్థానికురాలైన రాణితో పరిచయం ప్రేమగా మారింది. ఒకే ఇంట్లో ఉంటోన్న ఆ ఇద్దరూ క్రిమినల్సే. లోకల్ దొంగలముఠాతోకలిసి చోరీలు చేసేవాళ్లు. జువెలరీ షాపులు, సెల్ ఫోన్ స్టోర్లు, గార్మెట్ షాపులు.. ఇలా సందు దొరికిన ప్రతిచోటా దుకాణం దారుల చూపు మరల్చి వస్తువుల్ని గాయబ్ చేసేవాళ్లు. చాలా కేసులు నమోదైనా ఈ ముఠా పోలీసులకు దొరక్కుండా తప్పించుకుతిరిగేది.
తెలివి తెల్లారినట్లుంది..
దొంగతనాల్లో పార్ట్నర్గా ఉన్న రాణిని లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలని వినోద్ ఆశపడ్డాడు. ఆమేరకు ప్రపోజ్ చేయగా.. ఆమె నో చెప్పింది. గ్యాంగ్ లోని ఇతర దొంగలతోనూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా ఆమె కరగలేదు. దీంతో ఓ నిర్ణయానికొచ్చాడు. గతంలో వాళ్లు కలిసి దొంగతనం చేసిన షాపుల వివరాలు, వాటి ఫోన్ నంబర్లతో సహా పోగుచేసి.. నేరుగా పోలీసుల దగ్గరికెళ్లాడు. ఫలానా రాణి చోరీలకు పాల్పడిందని వాగ్మూలం ఇచ్చారు. అసలీ విషయాలన్నీ నీకెలా తెలిశాయంటూ పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. తానూ దొంగల ముఠా సభ్యుణ్నేనని ఒప్పుకున్నాడు.
ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా
వినోద్ ను అక్కడికక్కడే అరెస్టు చేసిన పోలీసులు.. ఆదివారం రాణిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడిద్దరూ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. సిర్సాతోపాటు నారాయణ్ ఘర్, పంజాబ్ లోని బతిండా, మాన్సా ఏరియాల్లోనూ ఈ ముఠా దొంగతనాలకు పాల్పినట్లు ఆధారాలున్నాయని, ప్రస్తుతం ఇద్దరినీ 15 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ కు తరలించామని సిర్సా సిటీ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో మనీందర్ సింగ్ తెలిపారు.