ఇల్లు దోపిడీ చేసి.. ఇంటి యజమానికి ఐ లవ్ యూ అని రాసివెళ్ళిన దొంగ
ఎవరైనా దొంగలు దొంగతనానికి వెళ్ళినప్పుడు ఎవరికీ పట్టుబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని చోరీ చేస్తారు. ఇక చోరీ చేసిన చోట తమకు సంబంధించిన ఏ ఆనవాళ్ళు లేకుండా చూసుకుంటారు. అయితే ఇటీవల కాలంలో దొంగలు చేస్తున్న ఆసక్తికరమైన పనులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. చోరీకి వెళ్ళిన ఇంట్లో పాటలు పెట్టుకుని డాన్సులు చేసిన ఓ దొంగ ఘనకార్యం మరిచిపోకముందే, మరో చోట దొంగలు ఆసక్తికరమైన పని చేశారు.
దక్షిణ గోవాలోని మార్గోవ్ పట్టణంలో ఇటీవల దొంగలు ఇంట్లో ఎవరూ లేనిది గమనించి ఓ బంగ్లాలోకి చొరబడి రూ. 20 లక్షలకు పైగా విలువైన వస్తువులను అపహరించి, ఇంటి యజమానికి ''ఐ లవ్ యు'' సందేశాన్ని వదిలి వెళ్లిన విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. హాలిడే ట్రిప్ కి ఊరికి వెళ్లిన ఇంటి యజమాని అసిబ్ జెక్ రెండు రోజుల సెలవుల అనంతరం ఇంటికి తిరిగి రాగా, ఇల్లంతా చిందరవందరగా ఉంది. దీంతో ఆయన తన బంగ్లాలో చోరీ జరిగినట్లు గుర్తించారు.

రూ.20 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రూ.1.5 లక్షల నగదు మాయం అయ్యాయని లబోదిబోమన్నారు. తన ఇంటిని దోచేసి దొంగలు పరారైనట్లు తెలిపారు. దీనికి తోడు టీవీ స్క్రీన్ పైన దొంగలు 'ఐ లవ్ యూ' అని రాసి ఉండడం చూసి ఇంటి యజమాని అవాక్కయ్యాడు. ఇక తన ఇంట్లో చోరీ జరిగిందని ఈ విషయమై మార్గోవ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, గుర్తుతెలియని నిందితులపై దొంగతనం కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంటిని దోచేసి ఇంటి యజమానికి ఐలవ్యూ అని రాసి వెళ్లిన దొంగల కోసం గాలిస్తున్నారు.
అంతకు ముందు కూడా ఇలాంటి ఆసక్తికరమైన చోరీ జరిగింది. ఉత్తరప్రదేశ్లోని చందౌలీలో దొంగతనానికి వెళ్లిన దొంగ అక్కడ చోరీ చేసిన తర్వాత సీసీ కెమెరాను చూస్తూ డాన్స్ చేస్తూ కనిపించాడు. క్యాష్ కౌంటర్ లో ఉన్న వస్తువులను దోచుకున్న అనంతరం చక్కగా ఎంజాయ్ చేస్తూ సీసీ కెమెరా ముందు డ్యాన్స్ చేశాడు. ఇప్పుడు మరో దొంగ ఐ లవ్ యూ అంటూ రాసి వెళ్ళాడు.












Click it and Unblock the Notifications