ప్రియుడితో కలిసి భర్త హత్య: మొదటి భార్య ఫిర్యాదు
బెంగళూరు: తన ప్రియుడి ప్రేమలో పడిన ఓ ప్రియురాలు తనను కట్టుకున్న భర్తనే హత్య చేయించింది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చోటు చేసుకుంది. అయితే ఆ తర్వాత తన భర్తను తన ప్రియుడే హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది ఇలా ఉండగా తన భర్తను రెండో భార్య, ఆమె ప్రియుడే హత్య చేయించారని మృతుడి మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరిద్దరి ఫిర్యాదులతో ఏ కేసులు నమోదు చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఘటనకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. సొన్నమారనహల్లి గ్రామానికి చెందిన మునిస్వామి(45)కి ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్షమ్మ దేహనహళ్లిలో నివసిస్తుండగా, రెండో భార్య శోభ సొన్నమారనహల్లిలో నివాసం ఉంటోంది. కాగా, శోభకు మధు (26) యువకుడితో పరిచయం ఏర్పడి అది కొన్ని రోజుల తర్వాత ప్రేమగా మారింది.

ఈ నేపథ్యంలో ఎలాగైనా మునిస్వామి అడ్డుని తొలగించాలని శోభ, మధులు నిర్ణయించుకున్నారు. ఆదివారం సాయంత్రం మునిస్వామి.. శోభను తన బైక్పై సొన్నమారనహల్లికి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో శోభ ద్వారా సమాచారం అందుకున్న మధు ఆటోలో వచ్చి లింగనహళ్లి గ్రామ శివారులోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద మునిస్వామితో గొడవకు దిగాడు.
ఆ తర్వాత వెంట తెచ్చుకున్న వేట కొడవలితో మునిస్వామి తలపై, భుజాలపై విచక్షణారహితంగా నరికేశాడు. అదే సమయంలో అటుగా వచ్చిన సుమో డ్రైవర్ నరసింహ ఏం జరిగిందని ప్రశ్నించగా.. కొడవలి దాచి, ఏదో వాహనం ఢీకొని వెళ్లిందని అతనికి చెప్పాడు మధు. ఆస్పత్రికి తీసుకెళ్దామని పిలవగా మధు అక్కడ్నుంచి పరారయ్యాడు. కాగా, మునిస్వామిని నరసింహ సహాయంతో శోభ ఆస్పత్రికి తీసుకెళ్లింది.
ఆదివారం అర్ధరాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మునిస్వామి మృతి చెందాడు. తన భర్తను వేట కొడవలితో మధు నరికి చంపాడని శోభ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మధును అరెస్ట్ చేసి విచారించారు. శోభ తనతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుందని మధు పోలీసులకు తెలిపాడు. ఇది ఇలా ఉండగా తన భర్తను రెండో భార్య, ఆమె ప్రియుడు మధు హత్య చేశారని మునిస్వామి మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications