చనిపోయిన 40 ఏళ్లకు తిరిగొచ్చిన మహిళ!
40 ఏళ్ల క్రితం మరణించిన ఓ మహిళ తిరిగొచ్చిన ఉదంతమిది. ఆమెను చూసి కుటుంబ సభ్యులతో సహా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
కాన్పూర్: అవును, మీరు చదివింది నిజమే. 40 ఏళ్ల క్రితం మరణించిన ఓ మహిళ తిరిగొచ్చిన ఉదంతమిది. ఆమెను చూసి కుటుంబ సభ్యులతో సహా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటుచేసుకుంది.
అసలేం జరిగింది? చనిపోయిన ఆ మహిళా ఎలా తిరిగొచ్చింది? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే... కాన్పూర్ సమీపంలోని బిడ్నూ గ్రామానికి చెందిన విలాస (82) అనే మహిళ 1976లో పశుగ్రాసం కోసం అడవిలోకి వెళ్ళింది.
ఆ సమయంలో ఆమె పాముకాటుకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆమెకు పక్క గ్రామంలోని నాటు వైద్యుడి వద్ద వైద్యం చేయించారు. అయినా ప్రయోజనం కానరాలేదు. కదలక మెదలక పడి ఉన్న ఆమె చనిపోయిందని భావించి స్థానికంగా ఉన్న గంగా నదిలో ఆమె దేహాన్ని పడేసి అంత్యక్రియలు కూడా నిర్వహించేశారు.
అలా నదిలో కొట్టుకుపోతున్న ఆమెను కన్నాజ్ జిల్లా సరిహద్దులో ఉన్న సరాయ్ తేకు గ్రామ వాసి అయిన రాం శరన్ అనే జాలరి కాపాడి, స్పృహ కోల్పోయిన ఆమెకు వైద్యం చేయించి రక్షించారు. అనంతరం విలాస కోలుకున్నప్పటికీ ఆమె తన గతం మర్చిపోయింది. అలా .. అలా 40 ఏళ్ళు గడిచిపోయాయి.
ఇటీవల ఆమెకు తన గతం గుర్తుకు వచ్చింది. నలభై ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్న ఆమె తన కథంతా ఓ బాలికకు వివరించగా సదరు బాలిక ఆ విషయాలను తన బంధువులకు వివరించింది.
దీంతో వారు విలాస గురించి ఆరా తీశారు, చివరికి చేత్రం (82) అనే వృద్ధుడు ఆమెను గుర్తుపట్టాడు. ఆతడు చెప్పిన వివరాల మేరకు ఎట్టకేలకు ఆమె కుమార్తెలైన రాంకుమారి, మున్నీల ఆచూకీ తెలుసుకుని విలాసను వారి వద్దకు చేర్చారు. పుట్టుమచ్చల ఆధారంగా వారు ఆమెను గుర్తు పట్టారు. 40 ఏళ్ల క్రితం చనిపోయిందని అనుకున్న తమ తల్లి సజీవంగా తిరిగి తమను చేరడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.