మోదీ మెడలో దండేయబోయిన ఆగంతకుడు- కాషాయం షర్ట్: రోడ్ షోలో అనూహ్యం
బెంగళూరు: దేశంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ ఏడాది ఏకంగా ఎనిమిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు జరుగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి, ప్రతిపక్ష యూపీఏకు ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించే ఈ పోరులో పైచేయి సాధించడానికి కసరత్తు షురూ చేశాయి ఆయా పార్టీలన్నీ.
చంద్రబాబుకు టెన్షన్ పెడుతున్న కుప్పం- వైసీపీ యువ గళం
ఇంకో రెండు నెలల్లో..
కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో అయిదు, ద్వితీయార్థంలో మూడు రాష్ట్రాలకు ఎన్నికలు షెడ్యూల్ కానున్నాయి. ఫిబ్రవరి-మార్చి నెలల్లో తొలి అయిదింటికీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇది మినీ సార్వత్రిక ఎన్నికలను తలిపిస్తోన్నాయి.
కర్ణాటకలో పట్టు కోసం..
పొరుగునే ఉన్న కర్ణాటకలో ఈ ఏడాది మార్చి-ఏప్రిల్లల్లో పోలింగ్ షెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది. మే నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం దాదాపు ఖాయమే. ఎప్పట్లాగే ఈ దఫా కూడా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) మధ్య ముక్కోణపు పోటీ ఏర్పడుతుందనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి కూడా- ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
మోదీ ప్రచార భేరీ..
ఈ పరిణామాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో పర్యటిస్తోన్నారు. ఈ మధ్యాహ్నం ఆయన హుబ్బళ్లికి వచ్చారు. స్వామి వివేకానందుడి జయంతిని పురస్కరించుకుని హుబ్లీలో నేషనల్ యూత్ ఫెస్టివల్ ను ఆయన ప్రారంభించారు. గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
రోడ్ షోలో..
హుబ్బళ్లి చేరుకున్న అనంతరం ఆయన రోడ్ షో నిర్వహిస్తోన్న సమయంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిల్చున్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న సమయంలో ఓ యువకుడు మోదీ వైపు దూసుకొచ్చాడు. మెడలో దండ వేయడానికి ప్రయత్నించాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత వలయాన్ని ఛేదించుకుని మరీ మోదీని చేరుకున్నాడు కూడా. తన చేతిలో ఉన్న దండను ఆయన మెడలో వేయబోయిన చివరి క్షణంలో అక్కడి భద్రత సిబ్బంది అతణ్ని పక్కకు లాగి పడేశారు.
విచారణకు ఆదేశం..
మోదీ రోడ్ షోలో భద్రత లోపం ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపించింది. రోడ్డు పక్కన బ్యారికేడ్లను దాటుకుని మరీ ఎలా వచ్చాడనే విషయంపై దర్యాప్తునకు ఆదేశించారు. ఆ యువకుడి నేపథ్యాన్ని ఆరా తీస్తోన్నారు. ప్రధాని భద్రత విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు చోటు చేసుకోలేదని, హుబ్బళ్లి-ధార్వాడ డీసీపీ డాక్టర్ గోపాల్ బైకోడ్ చెప్పారు. మోదీ మెడలో దండ వేయడానికి ప్రయత్నించిన యువకుడి గురించి మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామని వివరించారు.