ప్రియుడి పొందు కోసం యువతి షాకింగ్ నిర్ణయం: ఏకంగా హెచ్ఐవీ బ్లడ్ ఎక్కించుకుంది
గౌహతి: తను ప్రేమించిన ప్రియుడి కోసం ఎవరూ చేయని సాహసం ఓ యువతి చేసింది. ఆమె ప్రేమించిన యువకుడికి హెచ్ఐవీ ఉండటంతో అతడ్ని కలవనీయడం లేదనే నెపంతో.. ఏకంగా అతడి రక్తాన్ని ఆమె ఎక్కించుకుంది. ఇక ఇప్పుడు ఎవరూ తమను విడదీయలేరని చెబుతోంది. ఈ విస్తుపోయే ఘటన అస్సాం రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఫేస్బుక్ పరిచయం ప్రేమగా..
ఆ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని కామరూప్ జిల్లాలోని సువల్కచి గ్రామానికి చెందిన 19ఏళ్ల యువతి.. పక్క గ్రామానికి చెందిన ఓ యువకుడితో మూడేళ్ల క్రితం ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ ప్రేమలో మునిగితేలారు.
ప్రియుడితో మూడుసార్లు పరారు..
అయితే, ఆ యువకుడికి హెచ్ఐవీ ఉంది. ఈ విషయం తెలిసి కూడా ఆ యువతి అతడ్నే ఇష్టపడింది. మూడు సార్లు ఇద్దరూ గ్రామాన్ని విడిచిపారిపోయారు. అయితే, ప్రతిసారీ ఆమె కుటుంబసభ్యులు ఆమెను తిరిగి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే తమను విడదీయకుండా ఉండేందుకు తీవ్ర నిర్ణయం తీసుకుంది.
ప్రియుడికి హెచ్ఐవీ అని తెలిసినా.. షాకింగ్ నిర్ణయం
సిరంజీ సాయంతో తన ప్రియుడి నుంచి రక్తాన్ని తీసుకుని తన శరీరంలోకి ఎక్కించుకుంది. విషయం తెలిసిన యువతి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నారు.
ప్రియుడితో కలిసుండాలనే ఇలా చేశానంటున్న యువతి
యువతికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. ప్రియుడి నుంచి దూరంగా ఉండకూడదనే తాను అతని రక్తాన్ని ఎక్కించుకున్నట్లు ఆ యువతి తెలిపింది. ఇప్పుడు తమను ఎవరూ వేరు చేయలేరని అంటోంది. తమ ప్రేమను బతికించుకునేందుకే తాను ఈ పనిచేసినట్లు తెలిపింది. తన ప్రియుడి అమాయకుడని, అతడ్ని జైలు నుంచి విడిపించాలని కోరుతోంది.