ఆధార్ వల్ల గోప్యతకు భంగం కలగదు.. అదొక గుర్తింపు మాత్రమే : నందన్ నిలేకని
ఢిల్లీ : ఆధార్ కార్డు వాడకంపై ఎన్నో అనుమానాలు, మరెన్నో ఊహాగానాలు. ఆధార్ కార్డుతో తమ డేటా చోరీ అవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో వినియోగదారుల గోప్యతకు అర్థం లేకుండా పోతోందనే ఆరోపణలున్నాయి. అయితే అలాంటి వాటికి యునిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మాజీ ఛైర్మన్ నందన్ నిలేకని తాజాగా చేసిన వ్యాఖ్యలు సమాధానంగా కనిపిస్తున్నాయి.
ఆధార్ అనేది కేవలం ఒక గుర్తింపు మాత్రమేనని వ్యాఖ్యానించారు నందన్ నిలేకని. ఆధార్ కార్డు ద్వారా వ్యక్తుల మీద నిఘా పెట్టడం కుదరదని స్పష్టం చేశారు. అంతేకాదు ఆయా వ్యక్తుల గోప్యతకు భంగం కలిగించడం కూడా కుదరదని తేల్చి చెప్పారు. ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పలువురు అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా సమాధానాలు ఇచ్చారు.

ఆధార్ మీద ఇలాంటి చర్చ ఆహ్వానించదగ్గ పరిణామమని అభిప్రాయపడ్డారు నిలేకని. ఆధార్ గుర్తింపు సంఖ్యను అన్ని దరఖాస్తుల్లో వాడుతూ, వాటిని సమ్మిళితం చేస్తే మాత్రం ఆందోళన చెందొద్దని సూచించారు. ఆధార్ అనేది చాలా సరళీకృతమైన వ్యవస్థ అని అభివర్ణించారు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ సేకరించినప్పుడు మాత్రమే గోప్యతకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని చెప్పుకొచ్చారు. ఆధార్ కార్డుల ద్వారా వ్యక్తుల సమాచారం సేకరించలేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications