‘ఆధార్ అనుసంధానం బ్యాంక్ మోసాలను అడ్డుకోలేవు’: తేల్చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఆధార్ అనుసంధానం విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆధార్ అనుసంధానంతో బ్యాంకుల్లో మోసాలు ఆగవని కేంద్రానికి తేల్చిచెప్పింది. మోసాలను అరికట్టేందుకు ఆధార్ అనుసంధానం పరిష్కారం కాదని స్పష్టం చేసింది.
అధార్ అనుసంధానానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను గురువారం సుప్రీంకోర్టు విచారించింది. కొంతమంది బ్యాంకర్లే మోసగాళ్లతో చేతులు కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
మోసగాళ్లు ఎవరో బ్యాంకులకు తెలుసని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో చోటు చేసుకున్న భారీ కుంభకోణాల నేపథ్యంలో సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆధార్ పథకం చెల్లుబాటుపై పరిశీలన జరుపుతున్న ధర్మాసనం గురువారం ప్రభుత్వ వాదనలను నమోదు చేసుకుంది.
ఇది ఇలా ఉండగా, ఇంతకుముందు రోజు(బుధవారం) కూడా సుప్రీంకోర్టు ఆధార్ అనుసంధానం విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ప్రజల అనువంశిక లక్షణాలను కూడా యూఐడీఏఐ సేకరిస్తుందేమోనని మండిపడింది. డీఎన్ఏ పరీక్షల కోసం ప్రజల రక్త, మూత్ర నమూనాలనూ సేకరిస్తామని కూడా చెబుతుందేమోనని వ్యాఖ్యానించింది.
మరోవైపు, ఆధార్ను ఎంతో మంది నిపుణులు ఆమోదించారని, ఇది విధానపరమైన నిర్ణయం అయినందున న్యాయసమీక్ష అవసరం లేదని కేంద్రం తన వాదనలు వినిపించింది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్... ప్రభుత్వాలు తీసుకున్న విధాన నిర్ణయాలను న్యాయస్థానాలు సమీక్షించరాదని అన్నారు.
కాగా, దీనిపై జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏఎం ఖాన్ విల్కార్, జస్టిస్ డీవీ చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అయితే, దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిని ఆదుకోవాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. సాంకేతికంగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో సాగుతోన్న ఆధార్ కార్యక్రమంలో న్యాయస్థానాలు కల్పించుకోజాలవని వ్యాఖ్యానించారు.
ఇది పారదర్శకతతో కూడుకున్నదా? నిజాయితీతో ఉందా? అన్న అన్న విషయాలను మాత్రమే కోర్టులు విచారించగలుగుతాయని తెలిపారు. మరి ఈ పథకాన్ని, ఆధార్ కార్డును వ్యతిరేకిస్తున్న వారి పరిస్థితి ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. వేలిముద్రలు, కనుపాపలు సేకరించడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్టా? కాదా? అనే అంశంపై ప్రస్తుతం విచారిస్తున్నామని, భవిష్యత్తులో డీఎన్ఏ పరీక్ష కోసం రక్త, మూత్ర నమూనాలను కోరదన్న నమ్మకం ఏంటని న్యాయమూర్తులు ప్రశ్నించారు. అయితే వివిధ సంక్షేమ పథకాల్లో నిజమైన లబ్దిదారుల ఎంపికకు ఆధార్ ఎంతో ఉపకరిస్తోందని అటార్నీ జనరల్ వాదించారు.