సింగిల్ క్లిక్తో.. ప్రమాదమే: ఆధార్పై ఆర్బీఐ అనుసంధాన సంస్థ సంచలన రిపోర్ట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు, ఇన్సురెన్స్ పాలసీలు, మొబైల్ సేవల వరకు అన్ని సేవలకు ప్రస్తుతం ఆధార్ను అనుసంధానం చేస్తున్నారు. కానీ ఈ ఆధార్ ఎంత వరకు భద్రం అనేది అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. ఆధార్ భద్రతపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆ జర్నలిస్ట్లకు అవార్డులివ్వాలి: ఆధార్ ఉల్లంఘనపై ఎడ్వర్డ్ స్నోడెన్
ఓ వైపు ఆధార్ చాలా భద్రమంటూ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అనుమానాలు మాత్రం నివృత్తి కావడం లేదు. దీనిపై ప్రయివేటు అధ్యయనాలే కాకుండా ఆర్బీఐ రీసెర్చ్ర్లు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ రీసెర్చ్ పత్రాన్ని విడుదల చేశారు.
దీంతో మరింత ఆందోళన
రూ. 500 ఇస్తే ఆధార్ సమాచారం కావాలంటే వాట్సాప్లో పంపిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. దీంతో ఆధార్ సమాచారం భద్రంగానే ఉందని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) నొక్కి చెప్పినా ప్రజల్లో కలవరపాటు తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాకు అనుసంధానంగా ఉన్న ఓ సంస్థ ఆధార్ గురించిన చేసిన అధ్యయనం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
సైబర్ నేరగాళ్లకు లక్ష్యంగా
సైబర్ నేరగాళ్లకు ఆధార్ సులువైన లక్ష్యంగా ఉందని ఆ అధ్యయనం పేర్కొంది. ఆధార్ భద్రతపై ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ అధ్యయనం చేసి ఓ స్టాఫ్ పేపర్ను విడుదల చేసింది. ఇందులో సైబర్ నేరగాళ్లు ఆధార్ వ్యవస్థపై సులువుగా దాడి చేసే అవకాశముందని పేర్కొంది.
అంతకంటే మించిన ఆందోళన
స్వల్ప, దీర్ఘకాలికంగా ఆధార్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఇందులో ప్రధానమైనది డేటా భద్రత అని, వ్యాపారపరంగా కొందరు ఈ వివరాలను దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయని పేర్కొంది. అంతకంటే మించిన ఆందోళన మరొకటి ఉందని, అదే సైబర్ ముప్పు అని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ దాడులు పదేపదే జరుగుతున్నాయని గుర్తు చేసింది.
సింగిల్ క్లిక్తో... ప్రమాదం
యూఐడీఏఐకి కూడా ఈ సైబర్ దాడి ఇప్పుడు సవాల్గా మారిందని, ఆధార్ ఇప్పుడు దేశంలో అత్యవసరంగా మారిపోయిందని, ఎన్నింటికో ఆధార్ అనుసంధానంగా ఉందని, ఇక సైబర్ నేరగాళ్లకు ఆధార్ సులువైన లక్ష్యంగా ఉందని, సింగిల్ క్లిక్లో యావత్ భారత ప్రజల వివరాలు తెలుసుకోవచ్చు కాబట్టి దీనిపై సైబర్ నేరగాళ్లు కన్నేసే అవకాశముందని నివేదిక పేర్కొంది. అలాగే, ఆధార్ వల్ల కలిగే ప్రయోజనాలను కూడా ఈ నివేదికలో ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆధార్ ప్రయోజనాలు మిశ్రమంగానే కన్పిస్తున్నాయని తెలిపింది. ఆధార్ ఎంతవరకు అవసరమో కాలమే నిర్ణయించాలని పేర్కొంది.