స్పీడున్నోడు: అప్పుడే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితా ప్రకటించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: వచ్చే సంవత్సరం అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ అయిదింట్లో నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మిగిలిన ఆ ఒక్క రాష్ట్రం పంజాబ్లో కాంగ్రెస్ పాగా వేసింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాంచల్, గోవా, మణిపూర్లల్లో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. దేశ రాజకీయాలను మార్చివేసే సామర్థ్యం ఉన్న ఉత్తర ప్రదేశ్ను నిలబెట్టుకోవడం బీజేపీకి అత్యవసరంగా మారింది. ఈ నాలుగింట్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు బోనస్గా పంజాబ్ కోసం కసరత్తు చేస్తోంది.
పంజాబ్లో త్రిముఖ పోరు నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్-బీజేపీతో పాటు ఈ దఫా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గట్టిపోటీ ఇవ్వడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఏడాదికాలంగా కొనసాగుతూ వస్తోన్న రైతుల ఆందోళనలు, దీక్షలకు సంపూర్ణ మద్దతును ఇదివరకే ప్రకటించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. పంజాబ్లో తన సత్తా చాటడానికి అవసరమై కసరత్తు ఎప్పుడో మొదలు పెట్టేశారు. గోవాలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది.

ఈ పరిణామాల మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ మరో ముందడుగు వేసింది. గేరు మార్చింది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే.. అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దీనికి సంబంధించిన తొలి జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్లో దీన్ని పోస్ట్ చేసింది. తొలి విడతలో పదిమంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించిందా పార్టీ. వారి పేర్లు, నియోజకవర్గాలను ఇందులో పొందుపరిచింది.
Breaking News‼️@AAPPunjab announces its 1st list of candidates for upcoming Punjab assembly election #Mission2022 we are ready 💪 pic.twitter.com/xpgsubhVY3
— AAP (@AamAadmiParty) November 12, 2021
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమోదంతో ఈ జాబితాను రూపొందించినట్లు తెలిపింది. ఘడ్శంకర్ స్థానం నుంచి జైకిషన్ రవుదీ, జాగ్రాన్ స్థానం నుంచి సరవ్జిత్ కౌర్ మానుకె పోటీ చేస్తారు. నిహాల్ సింగ్ వాలా నియోజకవర్గంలో మన్జీత్ బిలాస్పూర్ను బరిలో దింపినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. కోట్కాపురా నుంచి కుల్తార్ సింగ్ సంధ్వాన్, తాల్వాండీ సాబో నుంచి బల్జీందర్ కౌర్ బరిలో ఉంటారని స్పష్టం చేసింది. బుధ్లాడా నియోజకవర్గం, దిబ్రా స్థానాలను ప్రిన్సిపల్ బుధ్రామ్, హర్పాల్ సింగ్ చీమాలకు కేటాయించినట్లు వివరించింది.
సునామ్ నియోజకవర్గం సీటును అమన్ అరోరా, బర్నాలా నుంచి గుర్మీత్ సింగ్ మీత్ హయెర్, మెహల్ కలాన్ టికెట్ను కుల్వంత్ పండోరీకి కేటాయించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది. మరో వారంరోజుల్లో రెండో జాబితాను ప్రకటిస్తామని పేర్కొంది. ఇప్పటిదాకా అధికార కాంగ్రెస్ గానీ, బీజేపీ లేదా శిరోమణి అకాలీదళ్ వంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఇంకా అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రక్రియను కొనసాగిస్తోన్నాయి. ఈ దశలో ఆప్ మాత్రం ఏకంగా తొలి జాబితాను విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications