‘ప్రతిష్ట దిగజార్చారు! అందుకే అమీర్ను తొలగించాం’
న్యూఢిల్లీ: ‘ఇన్క్రెడిబుల్ ఇండియా' బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ని తొలగించడం పట్ల ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్(డీఐపీపీ) సెక్రటరీ అమితాబ్ కాంత్ ఈ విషయమై మంగళవారం మాట్లాడారు.
దేశంలో అసహనం ఉందంటూ అమీర్ ఖాన్ భారత బ్రాండ్ దెబ్బతినేలా వ్యవహరించారన్నారు. బ్రాండ్ అంబాసిడర్ అన్నవారెవరైనా బ్రాండ్ ప్రతిష్ఠ మరింత పెంచేలా వ్యవహరించాలి గానీ దాన్ని దిగజార్చకూడదని అన్నారు.
దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల భారత ప్రతిష్ఠ దెబ్బతిందని అమితాబ్ దీక్షిత్ చెప్పారు. ఇన్క్రెడిబుల్ ఇండియా భారత్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిందని దానికి అంబాసిడర్గా ఉన్న అమీర్ ఇలా వ్యాఖ్యలు చెయ్యడం తగదన్నారు. అందుకనే ఆయనని బ్రాండ్ అంబాసిడర్గా తొలగించామని వివరణ ఇచ్చారు.
కాగా, ‘ఇన్క్రెడిబుల్ ఇండియా' ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్ను తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇటీవల అమీర్ స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని ఆయన తెలిపారు. దాదాపు పదేళ్లపాటు ఆయన ప్రచారకర్తగా వ్యవహరించారు. తాను ఉన్నా లేకపోయినా భారత్ ఉజ్వలమే(ఇన్క్రెడిబుల్ ఇండియానే) అని అన్నారు.
ఏదైనా ప్రభుత్వ కార్యక్రమానికి ప్రచారకర్త ఉండాలా లేదా ఎవరు ఉండాలి అనే అంశం పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమని, ప్రభుత్వ నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని అమీర్ ఖాన్ స్పష్టం చేశారు. ఇటీవల అసహనంపై ఆమీర్ఖాన్ మాట్లాడిన అంశం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.