వివాహిత మహిళపై రేప్: ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరెస్టు
న్యూఢిల్లీ: ఉద్యోగం ఇస్తానని వాగ్దానం చేసి, మహిళపై అత్యాచారం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారంనాడు పోలీసులు ఆ విషయం చెప్పారు. రమణ్ స్వామి అనే ఆమ్ ఆద్మీ పార్టీ నేత మహిళపై జనవరి 25వ తేదీన అత్యాచారం జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి.
రమణ్ స్వామిని పోలీసులు అరెస్టు చేసి ఫిబ్రవరి 8వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. కొద్ది రోజుల క్రితం దక్షిణ ఢిల్లీలోని హరికేష్ నగర్లో స్వామితో పరిచయం చేసుకున్నానని, ఉద్యోగం ఇప్పించాలని కోరానని ఆ మహిళ పోలీసులకు చెప్పింది.
జనవరి 25వ తేీదన తనను ఓఖ్లా ప్రాంతంలో కలవాలని మహిళకు అతను చెప్పాడని, ఆమె అక్కడికి రాగానే తన కారులో ఎక్కించుకుని ఓ ఇంటిలోకి తీసుకుని వెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు.
లైంగిక దాడి గురించి ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్వామి మహిళను బెదిరించాడని పోలీసులు అన్నారు. అదే రోజు ఆమె పోలీసుల వద్దకు వెళ్లింది. అత్యాచారం జరిగిందని వైద్యపరీక్షల్లో తేలిన తర్వాత స్వామిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్వామి డిసెంబర్ 4వ తేదీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారని, ఓఖ్లా నియోజకవర్గం సీటు కోసం ప్రయత్నాలు కూడా చేశాడని పోలీసులు చెప్పారు.